దుబాయి: వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గిన కింగ్స్ ఎలెవన్ మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. బెంగళూరు, ముంబై వంటి బలమైన జట్లపై విజయం సాధించిన పంజాబ్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. మరోవైపు ఢిల్లీ ఇప్పటికే ఏడు విజయాలతో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి ప్లేఆఫ్ బెర్త్ను ఖాయం చేసుకోవాలని భావిస్తోంది. అయితే ముంబైతో జరిగిన కిందటి మ్యాచ్లో సూపర్ ఓవర్లో విజయం సాధించిన పంజాబ్ జోరుమీదుంది. రెండు సార్లు మ్యాచ్ టైగా ముగియడంతో రెండో సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఇందులో పంజాబ్ అద్భుత విజయాన్ని అందుకుంది. కెప్టెన్ లోకేశ్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. మయాంక్ అగర్వాల్ కూడా దూకుడు మీద ఉన్నాడు.
క్రిస్ గేల్ రాకతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. కిందటి రెండు మ్యాచుల్లో కూడా గేల్ నిలకడైన బ్యాటింగ్తో జట్టుకు అండగా నిలిచాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. రాహుల్, మయాంక్ కూడా బ్యాట్ను ఝులిపిస్తే పంజాబ్కు ఎదురు ఉండదు. నికోలస్ పూరన్ కూడా జోరుమీదున్నాడు. అయితే మాక్స్వెల్ ఘోర వైఫల్యం జట్టుకు పెద్ద సమస్యగా మారింది. కిందటి మ్యాచ్లో కూడా మాక్స్వెల్ విఫలమయ్యాడు. కనీసం ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈసారైన తన బ్యాటింగ్ను మెరుగు పరుచు కోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇక శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, స్టోయినిస్ తదితరులతో ఢిల్లీ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. అయితే ఓపెనర్ పృథ్వీషా, సీనియర్ బ్యాట్స్మన అజింక్య రహానె పేలవమైన బ్యాటింగ్తో నిరాశ పరుస్తున్నారు. ఈసారైన ఇద్దరు మెరుగ్గా ఆడాలని జట్టు కోరుకుంటుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం.
IPL 2020: KXIP vs DC Match 2020 Tomorrow