అబుదాబి: కీలక మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్ను ఓడించిన రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఏడు వికెట్లు తేడాతో చెన్నైను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 125 పరుగులు సాధించింది. తర్వాత బరిలోకి దిగిన రాజస్థాన్ 17.3 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఒక దశలో 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ను స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్ ఆదుకున్నారు. ఇద్దరు నాలుగో వికెట్కు 98 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ 48 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్లతో అజేయంగా 70 పరుగులు చేశాడు. స్మిత్ 26 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు.
ఆరంభంలోనే..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్కు ఆరంబంలోనే కష్టాలు మొదలయ్యాయి. చెన్నై ఆరంభం నుంచే తడబడి బ్యాటింగ్ చేసింది. అద్భుత ఫామ్లో ఉన్న ఓపెనర్ డుప్లెసిస్ ఈసారి నిరాశ పరిచాడు. 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. వన్డౌన్లో వచ్చిన షేన్ వాట్సన్(8) కూడా విఫలమయ్యాడు. దీంతో చెన్నై 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ శామ్ కరన్ 22 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు జట్టును ఆదుకుంటాడని భావించిన సీనియర్ బ్యాట్స్మన్ అంబటి రాయుడు కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. రాయుడు 13 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. దీంతో చెన్నై 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ను కుదుట పరిచారు. అయితే రాజస్థాన్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్తో బౌలింగ్ చేయడంతో వీరిద్దరూ వేగంగా పరుగులు చేయలేక పోయారు. ఇక స్కోరును పెంచే క్రమంలో కెప్టెన్ ధోనీ ఔటయ్యాడు. ధోనీ రెండు ఫోర్లతో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన జడేజా 30 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో చెన్నై స్కోరు ఐదు వికెట్లకు 125 పరుగులకు చేరింది.
IPL 2020: RR Beat CSK By 7 Wickets