యుఎన్లో భారత్ స్పష్టీకరణ
ఐక్యరాజ్యసమితి: భారతదేశంలోని మతాల పట్ల పాకిస్తాన్ తన ప్రస్తుత సాంస్కృతిక విద్వేష వైఖరిని మార్చుకుని సీమాంతర ఉగ్రవాదానికి మద్దతును నిలిపివేస్తే దక్షిణాసియాలో నిజమైన శాంతిపూర్వక సంస్కృతి నెలకొంటుందని భారత్ స్పష్టం చేసింది.
ఐక్యరాజ్యసమి జనరల్ అసెంబ్లీలో బుధవారం శాంతి సంస్కృతి పేరిట జరిగిన ఒక సదస్సులో భారతదేశం తరఫున ఆశిష్ శర్మ ప్రసంగిస్తూ నేటి ప్రపంచంలో అసహనం, విద్వేషం, హింస, ఉగ్రవాదం దాదాపు సర్వసాధారణంగా మారిపోయాయని అన్నారు. అసహనం, హింసలకు మారుపేరైన ఉగ్రవాదంఆన్ని మత సిద్ధాంతాలు, సంస్కృతులకు విరుద్ధమైనదని ఆయన చెప్పారు. పాకిస్తాన్ తన మైనారిటీలపై దాడులు, మతమార్పిడులు, హత్యలు సాగించి భయాందోళనకు గురిచేయడం ద్వారా వారిని ఆ దేశం నుంచి తరిమికొడుతున్నంత వరకు తాము ఏమీ చేయలేమని ఆయన చెప్పారు. ఉగ్రవాద గ్రూపులను మతం పేరిట పాకిస్తాన్ రెచ్చగొట్టి వారికి ఆర్థిక సహాయం అందచేస్తూ పోవడం వల్ల భారత్ కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం అంటే రాక్షసుడికి ఆహారం అందచేయడం లాంటిదని, ఏదో ఒకరోజు అదే రాక్షసుడికి బలికాక తప్పదని శర్మ వ్యాఖ్యానించారు.