Monday, April 29, 2024

గౌడ కులస్తుల శుభకార్యాలకు ఉచితంగా ఏసి కన్వెన్షన్ సెంటర్

- Advertisement -
- Advertisement -

నీరా కేఫ్‌లు అన్ని జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు: మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్: గౌడ కులస్తులు సౌకర్యవంతంగా శుభ శుభకార్యాలు నిర్వహించుకునేందుకు రూ.6 కోట్లతో ఏసి కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించినట్లు రాష్ట్ర ఆర్ధిక,వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ కన్వెన్షన్ సెంటర్లో శుభకార్యాలు నిర్వహించుకునేందుకు గౌడ కులస్తులందరికీ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆదివారం శాసనసభ డిప్యుటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌తో శ్రీమహారేణుక (ఎల్లమ్మ) తల్లి గౌడ ఏసి కన్వీన్షన్ సెంటర్ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో రూ. 12 కోట్లతో ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌లాగా అన్ని జిల్లా కేంద్రాలలో నీరా కేఫ్‌లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులతో చెట్టు పన్నుతో ఇబ్బందులకు పడటమే కాకుండా, గీత కార్మిక సొసైటీలను రద్దు చేసి ఇబ్బందులకు గురి చేయగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే సిఎం కెసిఆర్ గీత పారిశ్రామిక సంఘాలను పునరుద్ధరించి చెట్టు పన్నును రద్దు చేసినట్లు వెల్లడించారు.లంచం కోసం ఆనాటి పాలకులు, అధికారులు కల్లు డిపోలను మూసి వేయగా, నేడు ప్రభుత్వం మద్యం దుకాణాలలో గౌడ కులస్తులకు రిజర్వేషన్ కల్పించిదని, గీత కార్మిక సహకార సొసైటీలు ఉంటే గౌడ జాతి అభివృద్ధి చెందుతుందన్నారు. గౌడ జాతి గౌరవం పెంచేలా సర్దార్ పాపన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు,మూడు కోట్ల రూపాయలతో ట్యాంక్ బండి పై సర్దార్ పాపన్న విగ్రహాన్ని సిఎం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ పునరుద్ధరణ కోసం సహకారం అందిస్తామన్నారు. అదే విధంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రసంగిస్తూ దిష్టి తగిలేలా రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా సిద్దిపేటలో గౌడ కులస్తులకు ఏసి కన్వెన్షన్ హాల్ నిర్మించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కన్వెన్షన్ సెంటర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టమన్నారు.

ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో ప్రత్యేకంగా మాట్లాడి చెట్టు పన్ను రద్దు చేయించినట్లు, తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి మంత్రి తన్నీరు హరీష్ రావుతో పాల్గొంటూ ఆయన పనితీరు దగ్గరగా చూసినట్లు పద్మారావు గౌడ్ చెప్పారు. హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోనే అన్ని రకాల అభివృద్ధి కనబడుతుందని హరీష్ రావు ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరి అదృష్టమని ప్రశంసించారు. ఈసందర్భంగా మాజీ శాశనమండలి చైర్మన్ స్వామి మాట్లాడుతూ గౌడ కులస్తుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందని, అన్ని రకాల అభివృద్ధి ,పర్యాటక కార్యక్రమాలకు సిద్దిపేట రూరల్ మోడల్. సిద్దిపేటలో నూతన హైదరాబాద్ నిర్మాణం అవుతుందని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మాజీ శాశనమండలి చైర్మన్ స్వామి గౌడ్, గీత పరిశ్రమిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్,పల్లె లక్ష్మణ్ గౌడ్, సిద్దిపేట జెడ్పిటిసి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News