అసెంబ్లీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
మన తెలంగాణ/హైదరాబాద్: ఆసరా పింఛన్ల కోసం 57 ఏళ్ళు ఆపై వయస్సు నిర్ధారణ కోసం పరీక్షలను నియోజకవర్గ కేంద్రాల్లోనే జరిగే విధంగా స్క్రీనింగ్ సెంటర్లు పెడతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. అసెంబ్లీలో పంచాయతీరాజ్ పద్దులపై మంత్రి మాట్లాడారు. పింఛన్ వయస్సు తగ్గించడంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి అదనంగా రూ. 2355 కోట్లు అదనంగా బడ్జెట్ను పెట్టుకున్నామన్నారు. మిషన్ భగీరథ కింద గ్రామంలో ప్రతి ఒక్కరికీ వంద లీటర్ల నీరు, మున్సిపాలిటీల్లో 135 లీటర్లు, కార్పొరేషన్లో 150 లీటర్ల నీరు, పరిశ్రమలకు 10శాతం నీటిని అందించే విధంగా ఈ పథకం రూపకల్పన చేశామన్నారు. ఒఆర్ఆర్ బయట ఉన్న 23,968 గ్రామాలకు, 120 పట్టణ స్థానిక సంస్థలకు నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ఆనకట్టల ద్వారా నీటిని తీసుకుంటున్నామని, మిషన్ భగీరథకు రూ.46,123 కోట్లు కేటాయించారని వివరించారు. ఇప్పటి వరకు మిషన్ భగీరథకు 3 సార్లు హడ్కో అవార్డు, జాతీయ వాటర్ మిషన్ అవార్డులు వంటివెన్నో వచ్చాయన్నారు.