Saturday, April 27, 2024

ప్రధాని పరోక్షంలో అగ్నిపథ్?

- Advertisement -
- Advertisement -

Agneepath scheme details controversy

అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాని మీద నిరసనలు తలెత్తటంతో సమర్ధించేందుకు మిలిటరీ అధికారులను దించింది. ఇది ఒక ప్రమాదకర సాంప్రదాయం. మనది పాకిస్థాన్, ఇతర అనేక దేశాల మాదిరి మిలిటరీ కనుసన్నలలో నడిచే ప్రభుత్వం కాదు. ఈ పథకం మిలిటరీ రూపొందించింది తప్ప తమది కాదు అని తప్పుకొనేందుకా అన్నట్లుగా ప్రధాని, సంబంధిత శాఖ మంత్రి ఇంతవరకు స్పష్టమైన ప్రకటనతో దేశం ముందుకు రాలేదు. పరోక్షంగా సుభాషితాలు పలుకుతున్నారు. ఈ పథకంతో మిలిటరీ ఎంపికలో సమూల మార్పులు చేశారు.

ఇదేమీ రహస్యం కాదు. విద్యుత్తు సంస్కరణల ప్రతిపాదనల మాదిరి. ముందుగానే ప్రతిపాదనలను బహిరంగంగా విడుదల చేసి అభిప్రాయాలను తీసుకోవచ్చు. ఈ పథకం గురించి వివరించేందుకు గాను మంగళవారం నాడు త్రివిధ దళాధిపతులు ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారని వార్తలు. ఈ పథకాన్ని కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన తరువాతనే జూన్ 14న ప్రకటించారు. ఇలాంటి కీలకాంశం గురించి ముందుగా ప్రధానికి వివరించకుండానే ఇదంతా జరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా? ఒకవేళ అదే జరిగితే నిరసన తలెత్తిన వెంటనే దీని సంగతేమిటని ప్రధాని అడిగి ఉండాలి కదా! ముందే తెలిపి ఉంటే ఇప్పుడు కొత్తగా చెప్పేదేమిటి? ఈ పథకం ప్రకటనతో తలెత్తిన శాంతిభద్రతల సమస్య గురించైతే అది మిలిటరీ అధికారులకు సంబంధం లేదు, హోంశాఖ మంత్రి, ప్రతినిధులు వివరించాలి. తగిన కసరత్తు, ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా తీసుకొనే సంస్కరణలు దేనికి దారితీస్తాయో పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, మూడు సాగు చట్టాల తీరుతెన్నులను చూశాము. అందుకే నష్టనివారణ చర్యగా ఈ తతంగం జరుగుతోందా అనే సందేహాలు కలగటం సహజం.

Prime Minister Modi in Gujarat Atkot

ఈ పథకానికి నిరసనగా సోమవారం నాడు భారత బంద్‌కు మిలిటరీ ఎంపికకు సిద్ధం అవుతున్నవారు పిలుపు ఇచ్చినట్లు వార్తలు. దాంతో ముందు జాగ్రత్త చర్యగా దేశమంతటా ఐదు వందలకు పైగా రైళ్లను రద్దు చేశారు. జార్ఖండ్‌లో స్కూళ్లను మూసివేశారు. ఢిల్లీ వంటి చోట్ల పోలీసుల అతి కారణంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. హర్యానాలో రెండు జిల్లాల్లో కోచింగ్ సెంటర్ల మూసివేతకు ఆదేశించారు. ఈ నెల 24న నిరసన తెలుపుతున్నట్లు రైతునేత రాకేష్ తికాయత్ ప్రకటించారు. సోమవారం నాడు బంద్ ఎలా జరిగిందన్నది ప్రశ్న కాదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందన్నదే కీలకం. ఒక్కటి మాత్రం స్పష్టం. అగ్నిపథ్ పథకం సంగతేమో గానీ దాని కింద శిక్షణ పొందిన వారు అగ్నివీరులమని చెప్పుకొనేందుకు సిగ్గుపడతారు. ఆ పథకం కింద ఎంపికైన వారికి మిలిటరీ శిక్షణలో భాగంగా ఇతర అంశాలతో పాటు బట్టలుతకటం, క్షౌరం చేయటం, చౌకీదార్లుగా నైపుణ్యం కల్పిస్తారట. ఇక ఈ పథకం గురించి విమర్శల వెనుక టూల్ కిట్ గ్యాంగ్ ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ ఆరోపించారు.మరి ఆ గ్యాంగ్ చిరునామా ఏమిటో వారి మీద కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేమిటో తెలీదు. ఒకవేళ అలాంటి గ్యాంగ్ ఉంటే వారు రూపొందిస్తున్న టూల్ కిట్లకు టూల్స్ సరఫరా చేస్తున్నది బిజెపి నేతలే. విమర్శించే వారు చెప్పేది స్పష్టంగా ఉంది. సమర్ధిస్తూ మాట్లాడే వారే అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నారు. రైతు ఉద్యమం సందర్భంగా దిశ రవి అనే యువతి మీద కేంద్ర ప్రభుత్వం టూల్ కిట్ కేసు పెట్టి దేశద్రోహానికి పాల్పడినట్లు ఆరోపించి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనకు సంబంధించిన సమాచారాన్ని ఒక చోట చేర్చి సామాజిక మాధ్యమంలో అందుబాటులో ఉంచటాన్నే టూల్‌కిట్‌గా వర్ణించారు.

తమ ఆఫీసులకు అవసరమైన భద్రతా సిబ్బంది నియామకంలో అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది కైలాష్ విజయవర్గీయ. ఆ పెద్ద మనిషి ఆరు సార్లు ఎంఎల్‌ఎగా, పన్నేండ్లు మంత్రిగా పని చేసి ఇప్పుడు వారసత్వంగా కుమారుడు ఆకాష్‌ను ఎంఎల్‌ఎ చేశారు తప్ప బిజెపి ఆఫీసులో చౌకీదారుగా నియమించలేదు. నోటికొచ్చినట్లు మాట్లాడటం కైలాష్‌కు కొత్తేమీ కాదు. స్వంత రాష్ర్టమైన మధ్యప్రదేశ్‌లో బిజెపి నేత లక్ష్మీకాంత శర్మ వంటి వారి ప్రమేయఉన్న వ్యాపం కుంభకోణం గురించి విలేకర్లు అడిగితే అది మీకు పెద్దది కావచ్చుగాని మాకు చిన్న కుంభకోణం అని సెలవిచ్చారు. దాని గురించి వివరాలు సేకరిస్తున్న జర్నలిస్టు అక్షయ సింగ్ అనుమానాస్పద స్థితిలో మరణించటం గురించి అడిగితే మరణించిన ఆ జర్నలిస్టును మరచిపోండి, నా కంటే అతను ముఖ్యమా అని ఎదురు ప్రశ్నించారు. అంతేనా దేశంలో జరుగుతున్న మానభంగాల గురించి అడిగితే మహిళలు వారి హద్దుల్లో వారు లేకపోతే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని సెలవిచ్చారు. ఇండోర్ నగరంలో ఒక పాత భవన కూల్చివేతను పర్యవేక్షిస్తున్న ఒక అధికారిని కుమారుడు ఆకాష్ హాకీ బాట్‌తో కొట్టడాన్ని సమర్ధించి తన పుత్ర ప్రేమను చాటుకున్నారు. వివాదాస్పద మాటలతో ఎప్పుడూ జనం నోళ్లలో నానుతున్న కైలాష్ అగ్నివీరులను బిజెపి ఆఫీసులో చౌకీదార్లుగా పెడతామని చెప్పటంలో ఆశ్చర్యం ఏముంది!

దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడి మిలిటరీలో చేరేందుకు సిద్ధపడుతున్న వారిని కించపరిచేలా ఉన్న తన వ్యాఖ్యలు దుమారం రేపటంతో తన మాటలను టూల్ కిట్ గ్యాంగ్ వక్రీకరించిందని ఎదురుదాడికి దిగారు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కైలాష్ ఇలా మాట్లాడారు.“నేను గనుక బిజెపి ఆఫీసులో భద్రతా సిబ్బందిని పెట్టాల్సి వస్తే అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తా, మీరు కూడా చేయవచ్చు. నా స్నేహితుల్లో ఒకరు 35 ఏండ్ల రిటైర్డ్ మిలిటరీ వ్యక్తిని సెక్యూరిటీ గార్డుగా పెట్టుకున్నారు, అతని మీద తనకు నమ్మకం ఉందని చెప్పారు. అతను సైనికుడు కాబట్టి తాను భయపడలేదని చెప్పారు. దీని అర్ధం ఏమిటి సైనికుడు అంటే ఆత్మవిశ్వాసం” అని కైలాష్ చెప్పారు. దీని మీద విమర్శలు తలెత్తటంతో వివరణ ఇచ్చుకుంటూ అంతకు ముందు చెప్పినదాన్ని సమర్ధించుకున్నారు”. అగ్నిపథ్ పథకం కింద శిక్షణ పొందిన అగ్నివీరులు తమ సర్వీసు పూర్తి చేసిన తరువాత వారు తప్పనిసరిగా నైపుణ్యం పొందుతారు, తమ విధుల పట్ల అంకిత భావంతో ఉంటారు. మిలిటరీలో తమ సేవ పూర్తి అయిన తరువాత ఎంచుకునే రంగాలలో ఈ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇదీ నేను చెప్పదలచుకున్నది. టూల్‌కిట్ ముఠాలతో సంబంధం ఉన్న నా మాటలను వక్రీకరించి శ్రమజీవులను కించపరిచేందుకు చూస్తున్నారు.

ఇది ఈ దేశ కర్మవీరులకు అవమానం. రాష్ర్ట వీరులు ధర్మవీరులకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న ఈ టూల్ కిట్ ముఠా గురించి దేశానికి బాగా తెలుసు” అన్నారు. నైపుణ్యం, అంకిత భావం ఒక్క మిలిటరీకేనా, ఇతర పౌరసేవల్లో ఉన్నవారికి అవసరం లేదా? దేశ యువతను అవమానించ వద్దని ఢిల్లీ సిఎం అరవింద కేజ్రీవాల్ అన్నారు. వారు దేశం కోసం పని చేసేందుకు సిద్ధం అవుతున్నారు తప్ప బిజెపి ఆఫీసు వెలుపల చౌకీదార్లుగా పని చేసేందుకు కాదు అన్నారు. 2019లో నేను కూడా చౌకీదారునే అనే బిజెపి ప్రచారం అర్ధం ఏమిటో ఇప్పుడు కైలాష్ మాటల ద్వారా బోధపడిందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చమత్కరించారు. బిజెపి ఎంపి వరుణ్ గాంధీ కూడా విమర్శించారు. మిలిటరీ అంటే దేశసేవ కోసం తప్ప కేవలం ఉపాధి కోసం కాదన్నారు. కేంద్ర టూరిజం మంత్రి జి కిషన్‌రెడ్డి కూడా అగ్నివీరుల గురించి అనుచితంగానే మాట్లాడారు.“అగ్ని వీరులకు ఇతర అంశాలతో పాటు ఎలెక్ట్రీషియన్లుగా, డ్రైవర్లుగా, బట్టలుతికేవారిగా, క్షురకులుగా అన్ని రకాల శిక్షణ ఇస్తారు” అన్నారు. నైపుణ్య శిక్షణ పేరుతో కార్యక్రమం ఉంది కదా అన్న విలేకర్ల ప్రశ్నకు మిలిటరీలో శిక్షణ ఇవ్వకూడదా అని ఎదురు ప్రశ్నించారు. ఈ పన్లు చేసేందుకు మిలిటరీలో చేరాలా అనే ప్రశ్న ఎదురవుతుందనే విచక్షణ బిజెపి నేతలకు లేకపోయింది. బట్టలుతికేందుకు మిషన్లున్నాయి. మిలిటరీ, పోలీసు క్రాఫ్‌లు చేసేందుకు నిజానికి పెద్ద నైపుణ్యంతో పనేముంది.

2018 ఏప్రిల్ 22న ఢిల్లీలో బిజెపి ఎంపిలు, ఎంఎల్‌ఎల సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన హిత వచనాలను ఆ పార్టీ నేతలు మరిచినట్లున్నారు. పార్టీ అధికారిక ప్రతినిధి నూపుర్ శర్మ చిల్లర మాటలు మాట్లాడి విధి లేని స్థితిలో సస్పెన్షకు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అగ్నిపథ్ పథకం మీద యువత ఆగ్రహించినపుడు ఆ పార్టీ నేతలు తమ నోటి తుత్తరను ప్రదర్శించారు. ఐదు సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ చెప్పిందేమిటి?’ మన మీడియాకు మసాలాను ఇస్తున్నాం. కెమెరాలను చూడగానే మనమేదో పెద్ద సామాజిక శాస్త్రవేత్తలం లేదా మేధావులం అన్నట్లుగా ప్రకటనలు చేసేందుకు దూకుతాం. తరువాత చెరుపు చేసే ప్రకటనలను ఉపయోగించుకొని మన పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు మీడియా చూస్తుంది. ఇది మీడియా తప్పుకాదు” అన్నారు. బహుశా ఈ కారణంగానే ఎన్ని విమర్శలు వచ్చినా ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రధానిగా మోడీ విలేకర్ల సమావేశం నిర్వహించలేదు.

భారత్ బంద్ పిలుపుకి సైతం దారి తీసిన అగ్నిపథ్ పథకాన్ని నరేంద్ర మోడీ సమర్ధించారు. సోమవారం నాడు బెంగళూరులో మాట్లాడుతూ అనేక నిర్ణయాలు, సంస్కరణలు తొలుత అనుచితంగానే కనిపించవచ్చు.తరువాత అవి జాతి నిర్మాణానికి తోడ్పడతాయి. రోజులు గడిచే కొద్దీ ఆ సంస్కరణలతోనే దేశం లబ్ధి పొందుతుంది. సంస్కరణల బాట మనలను నూతన లక్ష్యాలు, కర్తవ్యాల వైపు తీసుకుపోతుంది అన్నారు. 1990 నుంచి అమలు జరుపుతున్న సంస్కరణలు దేశం అంటే జనానికి చేసిన లబ్ధి ఏమిటన్నది బ్రహ్మ పదార్ధం. వాటిని మరింత వేగంగా అమలు జరుపుతున్నట్లు ప్రధాని గతంలో చెప్పారు. ఈ ఎనిమిదేండ్లలో అవిచ్చిన ఫలితాల కంటే దుష్ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అందువలన ఇలాంటి సుభాషితాలను నమ్మే స్థితి నుంచి జనం క్రమంగా బయటపడుతున్నారు. దానికి ప్రతిరూపమే అగ్నిపథ్ పథకంపై తలెత్తిన నిరసన. ఆ పథకాన్ని ఎలా సమర్ధించుకోవాలో అర్ధం గాక బిజెపి నేతలు రెచ్చగొట్టే కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. దేశభక్తి, క్రమశిక్షణ పేరుతో నోరు మూయించాలని చూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News