ఢిల్లీ: గత ఎనిమిది నెలల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఐదు సార్లు సమావేశమయ్యానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల నేతలు కీలక ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోడీ మీడియాతో మాట్లాడారు. రక్షణ, భద్రత, వాణిజ్యరంగాల్లో సహకారంపై చర్చలు జరిపామన్నారు. ఇంధన రంగంలో ఇరు దేశాలు సహకరించుకుంటాయని, ఉగ్రవాదులను ప్రోత్సహించే శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. ఆరోగ్య, ఇంధన అంశాలపై మూడు ఒప్పందాలు జరిగాయని తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సకుటుంబంగా భారత్ రావడం సంతోషంగా ఉందని మోడీ తెలిపారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో కలిసి సాగాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం కొనసాగుతోందని, సమాన అవకాశాలతో కూడిన స్వేచ్ఛాయుత వాణిజ్యంపై చర్చలు జరిపామని మోడీ పేర్కొన్నారు. నాలుగు రంగాల్లో 70 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరిందన్నారు.