Sunday, May 12, 2024

అంధుల కోసం ప్రత్యేక కళ్లజోడు

- Advertisement -
- Advertisement -

AI spects
చెన్నై: దృష్టి లోపం వారికి కూడా ఉపయోగకరంగా ఉండే కళ్లజోడును చెన్నైకు చెందిన కార్తీక్ మహాదేవన్, కార్తీక్ కన్నన్‌లు రూపొందించారు. వీరు ఈ కళ్లజోడును కృత్రిమ మేధస్సు టెక్నాలజీతో రూపొందించారు. వీరు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే కంప్యూటర్ విజన్, డిజైనింగ్ టూల్స్‌పై ఆసక్తి చూపారు. కార్తీక్ మహాదేవన్ మాస్టర్స్ డిగ్రీ కోసం నెదర్లాండ్స్‌కు వెళ్లి అక్కడి డెల్ఫ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో చేరాడు. అక్కడ చూపులేని వాళ్లు పడుతున్న బాధలు స్వయంగా చూశాడు. అప్పుడే వారి సమస్యకు ఏదైనా చేయాలనుకున్నాడు. వెంటనే తన మిత్రుడు కార్తీక్ కన్నన్‌ని సంప్రదించాడు. ఇద్దరు నిర్విరామంగా పనిచేసి, కృత్రిమ మేధస్సు టెక్నాలజీతో పనిచేసే సరికొత్త కళ్ల జోడును రూపొందించారు. తర్వాత ఎన్విజన్ స్టార్టప్‌ను ప్రారంభించారు. వారు మార్కెట్‌లోకి తెచ్చిన కళ్లజోడు అనతి కాలంలోనే నెదర్లాండ్స్‌తో పాటు యూరప్‌లో బాగా పాపులర్ అయ్యాయి. వారి స్టార్టప్ గురించి ‘ఫోర్బ్’ పత్రిక ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. వారు రూపొందించిన ఎన్విజన్ కళ్లజోడులో ఎనిమిది మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఎదురొచ్చే దృశ్యాలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుంది. సమాచారం కావాలనుకున్నప్పుడు చిన్నగా కళ్లజోడును టచ్ చేస్తే ఎదురుగా ఉన్న వస్తువులు, విషయాలు, వార్తలు, అక్షరాలు అన్నింటిని చదివి వినిపిస్తుంది. ఎవరి సాయం లేకుండానే ఈ కళ్ల జోడుతో అనేక పనులను అంధులు స్వయంగా చేసుకోవచ్చు. ఎన్విజన్ కళ్లజోడుకు అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. అంటే, వైఫై, బ్లూటూత్, యూఎస్‌బి, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. అయితే ఒక్కసారి ఈ కళ్ల జోడును ఛార్జి చేస్తే ఆరుగంటలపాటు నిరాటంకంగా వాడుకోవచ్చు. ఈ కళ్లజోడు ధర 3,268 యూరోలు(మన రూ. 2.70 లక్షలు).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News