ప్రతిపక్ష నాయకురాలిపై పాక్ మంత్రి వ్యాఖ్యలు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఫెడరల్ మంత్రి అలీ అమిన్ గండపూర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. దేశ ప్రతిపక్ష పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పిఎంఎల్ ఎన్) ఉపాధ్యక్షురాలు మర్యం నవాజ్పై ఈ మంత్రి పరుష వ్యాఖ్యలు పలు విమర్శలకు దారితీశాయి. మర్యం అందం మర్మం ఏమిటంటే ఆమె పలు బ్యూటీ సర్జరీలు చేసుకోవడం అని, ఇందుకు ఆమె ప్రజల డబ్బును దండిగా వాడుకుందని ఈ మంత్రి వ్యాఖ్యానించారు. తాను నిజాలే చెపుతానని, ఆమె అందంగా ఉంటుంది అయితే అందం చెక్కుచెదరకుండా చేసుకునేందుకు దండిగా సర్కారు డబ్బులు వాడుకుందనేది కూడా తెరవెనుక నిజం అని ఆయన వ్యాఖ్యానించినట్లు జియో న్యూస్ తెలిపింది.
నవాజ్ షరీఫ్ ప్రభుత్వపు రెండు హయాంలలో ఆమె ముఖానికి ప్లాస్టిక్ సర్జరీల కోసం కోట్లాది రూపాయలను యదేచ్ఛగా వాడుకుందని మంత్రి ఆరోపించారు.అందంగా ఉన్న ఓ మహిళపై మంత్రి ఇటువంటి పరుష పదజాలం వాడటం అనుచితం అని పార్టీల నేతలు దుయ్యబట్టారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) సెనెటర్ షెర్రీ రెహ్మన్ స్పందిస్తూ గండాపూర్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని అన్నారు. తరచూ భారతదేశపు వ్యవహారాలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలకు దిగడంలో ఈ మంత్రి ముందున్నారు. అంతేకాకుండా ఈ మంత్రి వ్యక్తిగత సలహాదారు కూడా మహిళలను కించపరుస్తూ మాట్లాడటం వివాదాస్పదం అయింది.