Friday, May 3, 2024

ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం..చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో టిడిపి అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై విజయవాడ ఎసిబి కోర్టులో బుధవారం వాదనలు పూర్తయ్యాయి. గురువారం ఉదయం తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. ఎసిబి కోర్టులో సిద్దార్ధ లూథ్రా, ఎఎజి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున లాయర్ సిద్దార్ధ లూథ్రా ఎసిబి కోర్టులో వాదనలు వినిపించారు. చంద్రబాబు అవినీతి చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవన్నారు. అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌జి భద్రత ఉన్న వ్యక్తిని విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును కస్టడీకి కోరుతున్నారని తెలిపారు. చంద్రబాబుకు పోలీసు కస్టడీ అవసరం లేదన్నారు. నాలుగేళ్లుగా ఎవరినీ అరెస్టు చేసినా, నిధులు దుర్వినియోగం పేరే చెబుతున్నారన్నారు. చంద్రబాబు అరెస్టు రాజకీయ కుట్రతోనే జరిగిందని తెలిపారు. ఎసిబి విచారణలో కొత్త కోణం కోర్టు ముందు పెట్టలేక పోయారని సిద్దార్ధ లూథ్రా తన వాదనలు వినిపించారు.

ఎసిబి కోర్టులో ప్రభుత్వం తరఫున ఎఎజి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఐదు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అప్పగించాలని సిఐడి కోరిందని తెలిపారు. ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రూ.371 కోట్లు దుర్వినియోగం అయ్యా యని స్పష్టమైన ఆధారాలు వున్నాయన్నారు. చంద్రబాబును కస్టడీకి తీసుకుని విచారిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని పొన్నవోలు వాదించారు. చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశారన్నారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ మరింత విచారించాలని తెలిపారు. కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికితీయడం ముఖ్యమని అన్నారు. చంద్రబాబును మరోసారి విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధులు ఎక్కడెక్కడికి వెళ్లాయో సమాచారం ఉందన్నారు. కేసులో ఇంకా పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉందని ఎఎజి సుధాకర్‌రెడ్డి ఎసిబి కోర్టులో వాదనలు వినిపించారు.

హైకోర్టు క్వాష్ పిటిషన్‌పైనా తీర్పు నేడే…
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మంగళవారం పూర్తయింది. గురు వారం తీర్పు ఇచ్చేఅవకాశం ఉంది. మంగళవారం హైకోర్టులో జరిగిన వాదనల్లో ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్, ఎఎజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూధ్రా వాదించారు. హోరాహోరీగా సాగిన వాదనల్లో కొన్ని కీలక అంశాలను ఇరు పక్షాలు లెవనెత్తాయి. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర తో పెట్టిన కేసు అని చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు. పలు ఉదాహరణలు చెప్పారు. చంద్రబాబు తప్పు చేశారన్న దానికి ఒక్క సాక్ష్యం కూడా లేదన్నారు. పైగా అరెస్టు కూడా తప్పుడు పద్దతిలో చేశారని, గవర్నర్ అనుమతి తీసుకోలేదన్నారు. అరెస్ట్ చేసే నాటికి ఎఫ్‌ఐఆర్ లో పేరు లేదన్నారు.

ఈ సందర్భంగా పలు కేసులను హరీష్ సార్వే న్యాయమూర్తికి వివరించారు. అర్నాబ్ గోస్వామితో పాటు రాఫెల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులనూ వివరించారు. మరో వైపు ప్రభు త్వం తరపు లాయర్లు చంద్రబాబును అరెస్ట్ చేసి పది రోజులే అయిందని ఇంకా దర్యాప్తు జరుగుతోందని వాదించారు. స్కిల్ కాంట్రాక్టు పొందిన డిజైన్ టెక్ సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చిందని వారు నిధులు దారి మళ్లించారని చెప్పారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న న్యాయూమూర్తి ఆ సబ్ కాంట్రాక్టర్లతో పిటిషనర్‌కు అంటే చంద్రబాబుకు సంబంధం ఉందని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. దీనికి నేరుగా సమాధానం చెప్పలేక పోయి న ప్రభుత్వ లాయర్ రంజిత్ కుమార్ వేరే కేసులో చంద్రబాబుకు వచ్చిన ఐటి నోటీసుల్ని చూపించారు. తీర్పు ను బట్టి తదుపరి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News