Thursday, May 16, 2024

ఆసీస్‌దే డబ్ల్యూటిసి టైటిల్

- Advertisement -
- Advertisement -

ఆసీస్‌దే డబ్ల్యూటిసి టైటిల్

ఫైనల్‌లో 209 పరుగులతో టీమిండియా ఓటమి
ఓవల్: టీమిండియాకు ఫైనల్ ఫోబియానో.. ఏమో కానీ ఫైనల్ ఓటములు మూటగట్టుకుంటోంది. వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు చేరినా రెండింటిలోనూ పరాజయంపాలై రన్నరప్‌గా నిలిచంది. ఈసారైనా కప్ గెలుచుకుంటుందనుకున్నా టీమిండియా అభిమానుల ఆశలను నిలబెట్టలేకపోయింది. అయితే అసాధారన ఆటను కనబర్చిన ఆస్ట్రేలియా టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో విజేతగా నిలిచింది. 209 పరుగుల తేడాతో విక్టరీ అందుకున్న కంగారుల టీమ్ డబ్ల్యూటిసి టైటిల్ గెలుపొందిన రెండో జట్టుగా రికార్డులకెక్కింది. అయితే నాలుగో రోజు ఆశలు రేపిన టీమిండియా ఐదో రోజు కనీసం పోరాడకుండానే చేతులెత్తేసింది. 444 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌సేన ఐదో రోజు తొలి సెషన్‌లో 63.3 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. చివరి రోజు టీమిండియా గెలువాలంటే 280 పరుగులు కావాలి. అందుకు ఆస్ట్రేలియా గెలువాలంటే 7 వికెట్లు పడగొట్టాలి. కానీ ఆసీస్ బౌలర్ల అద్భుతమైన ప్రదర్శనకు ఫలితం దక్కింది. 164/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు.

మరోవైపు తొలి సెషన్ నుంచే భారత బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. క్రీజులో విరాట్ కోహ్లి, అజింక్యా రహానె ఉండటంతో భారత్ విజయంపై ధీమాతో ఉంది. పోరాడితే కనీసం మ్యాచ్ డ్రా అవుతుందని భావించారు. కానీ తొలి గంటలోనే భారత ఓటమి ఖాయమైంది. ఒకే ఓవర్లో విరాట్ కోహ్లి(49), రవీండ్ర జడేజా(0)ను ఔట్ చేసిన స్కాట్ బోలాండ్ భారత్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. అంజిక్యా రహానె క్రీజ్‌లో ఉండటం.. ఓవల్‌లో హాఫ్ సెంచరీల హ్యాట్రిక్ సాధించిన శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో భారత అభిమానుల్లో ఏదో మూలన ఆశలున్నాయి. కానీ స్టార్క్ బౌలింగ్‌లో రహానె (46) వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాసేపటికే శార్దుల్ ఠాకూర్ కూడా డకౌట్‌గా వెనుదిరగడంతో ఆసీస్ విజయం ఖాయమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్ 4 వికెట్లు పడగొట్టగా.. స్కాట్ బోలాండ్‌కు 3, మిచెల్ స్టార్క్‌కు 2 వికెట్లు పడగొట్టి ఆసీస్ గెలుపునకు కీలక భూమిక పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News