హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడికి చేపట్టిన లాక్డౌన్ వల్ల రాష్ట్రంలోని ఆసుపత్రులలో పూర్తిగా రక్తనిల్వలు తగ్గిపోయి అనేక మందికి అత్యవసరంలో రక్తం అందడం లేదని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రక్తదానానికి బిజెపి యువమోర్చా కార్యకర్తలు ముందుకు రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి ప్రధాని మోదీ ఇచ్చిన లాక్డౌన్ ప్రజలు పాటించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధి గ్రస్తులకు ప్రతి రోజు ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రక్తం అవసరం ఉంటుంది వారికి అవసరమైన రక్తం అందించడానికి యువమోర్చా కార్యకర్తలు సిద్దంగా ఉండాలని కోరారు. రక్తం కావాల్సిన ప్రజలు, అధికారులు స్థానిక బిజెపి కార్యకర్తలను సంప్రదించాలని ఆయన పిలుపునిచ్చారు.
అంబేద్కర్ ఆశయ సాధనకు పాటుపడండి…
మంగళవారం దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి కార్యకర్త ఎవరికి వారు ఇంట్లో పుష్ఫాంజలి ఘటించాలన్నారు. దేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహానుభావుడి జయంతి సందర్భంగా సామాజిక దూరం పాటిస్తూ బస్తీల్లో పేదలకు నిత్యావసర, అత్యవసర వస్తువులు అందించాలని, ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరోరాఉ. ప్రతి ఒక్కరు అంబేద్కర్ జీవిత చరిత్ర, రాజ్యాంగ స్ఫూర్తినిప తెలుసుకుని వారి ఆశయ సాధనకు పాటుపడాలని బండి సంజయ్ తెలిపారు.
ప్రతి జిల్లాలో లక్ష మాస్క్లు తయారీ, పంపిణీ జరగాలి…
మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో లక్ష మాస్క్లు తయారు చేసి పంపిణీ చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. సోమవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మాస్క్ల తయారీపై శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని పారదోలడంలో లాక్డౌన్ ప్రధానమైతే, అరికట్టడంలో మాస్క్లే కీలకమన్నారు. రాష్ట్రంలో మాస్క్లు కొనలేని పేద వర్గాలకు అందించేందుకు మహిళా మోర్చా కృషి చేయాలన్నారు. ప్రతి జిల్లాలో మహిళలకు శిక్షణ కల్పించి మాస్క్లు తయారు చేయించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మోర్చా ఆధ్వర్యంలో నగరంలో మాస్క్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బిజెపి ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్, సీనియర్ నేతలు పెరిక సురేష్, వినోద్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.