హైదరాబాద్ ః కరోనా వైరస్ వ్యాధికి చికిత్స చేస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేయని మూర్ఖుడు, అజ్ఞాని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ ధ్వజమెత్తారు. కరోనా కట్టడికి అందరూ తమ వంతు సాయం అందించాలని, రోగుల ఐసోలేషన్కు వాడుకోవడానికి ఓవైసీ ఆసుపత్రిని ఇవ్వాలన్నారు. ప్రధాని మోదీపై ఓవైసీ చేసిన విమర్శలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఓవైసీని మత మౌఢ్యం తలకెక్కిన ఉన్మాదిగా సంజయ్ అభివర్ణించారు. కరోనాపై పోరాటానికి దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ సూచిస్తే దానిని కూడా మత కోణంలో చూడడం ఓవైసీ అవివేకానికి నిదర్శనమన్నారు. ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలని, వైద్యులకు కృతజ్ఞతలు తెలపడం ఓవైసీకి తెలియదని బండి సంజయ్ అన్నారు.
దేశ ఐక్యత కోసం మోదీ పిలుపునిచ్చారన్నారు. ఆదివారం రాత్రి దారుసలెం వెళ్లి చూస్తే ప్రజల స్పందన కనువిందు చేస్తుందని సంజయ్ అన్నారు. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా వైద్యులపై ద్రోహులు భౌతిక దాడులకు దిగినప్పటికీ సహనంతో వారు సేవలనందిస్తున్నారన్నారు. కరోనా బారిన పడి వేలమంది బాధపడుతుంటే ఓవైసీ ఆసుపత్రిని ఐసోలేషన్ వార్డుకు ఇచ్చేసి వాళ్లకు ధైర్యం చెప్పలేని అజ్ఞాని ఓవైసీ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓవైసీకి దమ్ముంటే వైద్యులు, నర్సులపై, పోలీసులపై ఆశావర్కర్లపై దాడులు ఆగేలా చూడాలన్నారు.