ముంబై : కరోనా మహమ్మరి దెబ్బకు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ నిర్వహణపై ఇటీవలే మళ్లీ ఆశలు చిగురించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్పై నీలినీడలు కమ్ముకున్నాయి. వరల్డ్కప్ను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం తమ వల్ల కాదని ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఎర్ల్ ఎడ్డింగ్స్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక పరిస్థితులు కూడా ప్రపంచకప్ నిర్వహణకు అనుకూలంగా కనిపించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి ఇంకా ఏమాత్రం తగ్గలేదు.
దీంతో ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్కు అన్ని జట్లు హాజరవుతాయా అనేది సందేహంగా మారింది. దీనికి తోడు ఆస్ట్రేలియాలో విదేశీయుల రాకపై సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు ఉన్నాయి. ఈ ఆంక్షలను సడలించే విషయంలో క్రికెట్ బోర్డుకు అక్కడి ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లభించలేదు. దీంతో నిర్ణీత సమయంలో ప్రపంచకప్ నిర్వహించడం తమ వల్ల కాదని క్రికెట్ ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. ఇక, ఈ ఏడాది వరల్డ్కప్ జరిగే అవకాశాలు ఏమాత్రంకనిపించక పోవడంతో భారత క్రికెట్ బోర్డు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
రంగంలోకి దాదా
ఇక, అందివచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనే పట్టుదలతో భారత క్రికెట్ బోర్డు కనిపిస్తోంది. ప్రపంచకప్ కోసం ప్రకటించిన షెడ్యూల్లో ఐపిఎల్ను నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పావులు కదుపుతున్నాడు. ఇందకుగాను గంగూలీ స్వయంగా రంగంలోకి దిగాడు. పరిస్థితులు ఎప్పటికప్పుడూ గమనిస్తూనే ఐపిఎల్ కోసం ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నాడు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు లేఖలు రాసి ఐపిఎల్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని కోరాడు. మరోవైపు ఫ్రాంచైజీల యాజమాన్యాలు, స్టార్ క్రికెటర్లతో ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నాడు. ప్రపంచకప్ వాయిదా పడితే ఆ సమయంలో ఐపిఎల్ను ఎలాగైన నిర్వహించాలనే పట్టుదలతో గంగూలీ ఉన్నాడు.