Saturday, April 27, 2024

విపక్షాల ట్రాప్‌లో పడొద్దు

- Advertisement -
- Advertisement -

నిర్వాసితులకు ఇప్పటికే రూ.200కోట్లు
చెల్లింపు ఎకరాకు రూ.15లక్షల నష్ట
పరిహారమిచ్చాం కేవలం 84 ఎకరాల
పైనే వివాదం హుస్నాబాద్‌కు నీళ్లు
రాకుండా కాంగ్రెస్, బిజెపి అడ్డు
తగులుతున్నాయి ఎవరికీ అన్యాయం
చేయం, కోర్టుకెక్కినవారికీ పరిహారం
ఎన్నిసార్లయినా నిర్వాసితులతో చర్చలకు
ప్రభుత్వం రెడీ : మంత్రి హరీశ్‌రావు

గౌరవెల్లి ప్రాజెక్టుతో లక్ష కుటుంబాలకు లబ్ధి

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: గోదావరి జలాలు పొ లాల్లోకి పారుతుంటే రైతుల కళ్లల్లో అనందబాష్పాలు వస్తుంటే.. బిజెపి, కాంగ్రెసోళ్ల కళ్లల్లో కన్నీళ్లు వస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం గౌరవెల్లి రిజర్వాయర్ సంఘటనపై ఆయన విలేకరులతో మా ట్లాడుతూ ఆందోళనకారులెవరూ ప్రతిపక్ష పార్టీల ట్రాప్‌లో పడొద్దని వేడుకొన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా గౌరవెల్లి నిర్వాసితులకు ఎకరానికి రూ.15 లక్షల పరిహారం ఇస్తున్నామని, ఇప్పటికే 97.82 శాతం భూసేకరణ జరిగిందన్నారు. అందుకోసం రూ.200 కోట్లు చెల్లించామని మం త్రి స్పష్టం చేశారు. నిర్వాసితులకు దండం పెట్టి చెబుతున్నా.. కాంగ్రెస్, బిజెపి నేతలు చెప్పే మాటలు వినకండి, మీకు సమస్యలుంటే మీ తరుపున ప్రతినిధి బృందం వచ్చి అధికారులతో చర్చించండి. ప్రభుత్వం నిర్వాసితులపట్ల సానుభూతితో ఆలోచిస్తుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. నాడు మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ జలాశయం పనులు అడ్డుకున్నారన్నారు. ప్రజలు, రైతులు బాగుపడటం ఇష్టంలేక అడ్డుకునే యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ అధికారులు పనులు చేసుకుంటే వరుసగా దాడులు చేస్తూ పనులను అడ్డుకున్నారన్నారు. రేగొండ పంప్‌హాస్‌లో పనులు చేసుకుంటే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. 2013 చట్టం ప్రకారం ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తామన్నారు. మొత్తం భూ సేకరణ 3900గాను 3816 ఎకరాలు జరిగిందని, కేవలం 84 ఎకరాల భూమి సేకరణ జరగాల్సి ఉందన్నారు.

కొంతమంది కోర్టుకు వెళితే పరిహారం కోర్టులో డిజిపాట్ చేశామన్నారు. అదే విధంగా ఇండ్లు కోల్పోయిన 693 మందికి 83 కోట్లు చెల్లించామని, 98.58శాతం పేమెంట్ చేశామని చెప్పారు. ఇంకా 1.45 మాత్రమే చెల్లించాల్సి ఉందన్నారు. కేవలం 10 ఇండ్లకు మాత్రమే చెల్లించలేదని ఇందులో 5ఇండ్లు రీసర్వే చేయమన్నారు. మిగతా ఐదు ఇండ్లలో కుటుంబ తగాదాలు ఉన్నాయన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద మొత్తం 937 కుటుంబాలను గుర్తించామని, ఇందులో 927కుటుంబాలకు పరిహారం చెల్లించామని, మిగతా 10 కుటుంబాలు కోర్టును ఆశ్రయించారని తెలిపారు. చైనా నుంచి మోటర్లు తెప్పించాం.. మూడేళ్లు వారంటీ ఉంటుంది ఆ సమయం దగ్గర పడడంతో వెట్ రన్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. గోదావరి జలాలు హుస్నాబాద్‌ను ముద్దాడడానికి వస్తుంటే.. కాంగ్రెస్ బిజెపిలు అడ్డుకుంటున్నారన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి గోదావరి జలాలు రాకుండా చేయడమే బిజెపి, కాంగ్రెస్ నాయకుల లక్షమన్నారు. వారంతా అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్నారన్నారు.

భూ నిర్వాసితులతో కలిసి మంత్రిని కలిసిన ఎంపి పొన్నం

ఇదిలా ఉండగా.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మెట్టుబండల వద్ద మంత్రి హరీశ్‌రావును గౌరవెల్లి భూ నిర్వాసితులు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, నాయకులు కోదండరెడ్డి కలిసి మాట్లాడారు. నిర్వాసితులతో మంత్రి హరీశ్‌రావు గంట సేపు చర్చలు జరిపారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌరవెల్లి భూ నిర్వాసితులకు 18 నుంచి 20 సంవత్సరాల వారికి ప్రత్యేక ప్యాకేజీ, భూములు కోల్పొయిన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రత్యేక ప్యాకేజీ కింద మంజూరు చేయాలని కోరడం, గ్రామ భూ నిర్వాసితులతో గ్రామంలోనే సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దామన్నారు. నిర్వాసితుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించి నిర్వాసితులకు, కాంగ్రెస్ నాయకులకు మంత్రి భోజనం పెట్టి పంపించారు. కార్యక్రమంలో భూ నిర్వాసితులు, కాంగ్రెస్ నాయకులు కోదండరెడి,్డ హుస్నాబాద్ ఇంచార్జి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సత్యనారాయణ, బొమ్మల యాదగిరి, అత్తు, ఇమాం, సూర్యవర్మ, మధు, అజ్జు యాదవ్, భూ నిర్వాసితుల గ్రామ సర్పంచ్ బద్దం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News