Monday, April 29, 2024

ద్వేషభక్తి దేశానికి చేస్తున్న గాయం!

- Advertisement -
- Advertisement -

ఈ దేశంలోని ప్రతి పౌరుడూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని వున్నాయి 1931లో విప్లవ వీరుడు భగత్ సింగ్ పక్షాన తీవ్రంగా వాదించిన న్యాయవాది ఆసఫ్ అలీ. భగత్ సింగ్‌ను శిక్షించడానికి నిరాకరించి, తన జడ్జి పదవికి రాజీనామా చేసిన జస్టిన్ సయ్యద్ ఆగా హైదర్. ఇకపోతే భగత్ సింగ్‌కు ఉరి శిక్ష విధించిన జడ్జి రాయ్ సాహిబ్ పిండిట్ శ్రీ క్రిషన్. నరనరాన ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం నింపుకున్న వ్యక్తి. ఈ వివరాలు తెలుసుకొన్న తర్వాత లేదా గుర్తు చేసుకొన్న తర్వాత ఎవరు దేశభక్తులు, ఎవరు దేశద్రోహులు? అనే విషయం విజ్ఞత గల ఈ దేశ పౌరులు పూర్తిగా అర్థం చేసుకొంటారు. ముస్లిం అయినంత మాత్రాన ద్వేషించాలని, హిందువులంతా బంధువులేనని అనుకోక తప్పదా? భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నది ఎవరు? పాల్గొనని వారెవరు? తెలుసుకోనక్కర లేదా? ప్రస్తుతం అధికారంలో వున్న వారు ప్రచారం చేస్తున్న విద్వేష భక్తి గేయాలు పాడుకోవాల్సిందేనా? నిజానిజాలు తెలుసుకొనే పని లేదా? మండిపోతున్న మణిపూర్ లాగా దేశమంతా కావాల్సిందేనా? గౌరవనీయులైన మూర్ఖుల సంఖ్య పెరుగుతున్నప్పుడు, సామాన్య పౌరులు తమ వివేకాన్ని నిద్ర లేపాలి. ప్రతి చిన్న విషయాన్నీ హేతుబద్ధంగా విశ్లేషించుకొంటూ ముందుకు సాగాలి. మనది ప్రజాస్వామ్య దేశం! మనుషులంతా ఒక్కటి!! ఈ రెండు విషయాలకు కట్టుబడి మాత్రమే నిజాయితీగా నిబద్ధతతో నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుంది.

తాము సనాతన ధర్మాన్ని గౌరవించే వారిమని, దాన్ని వ్యతిరేకించే వారి వ్యాఖ్యలు తమ మనోభావాల్ని గాయపరుస్తున్నాయని, ఆ వ్యాఖ్య లు చేసే వారిని కఠినంగా శిక్షించాలని మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అలాంటి లేఖ రాసిన వారికి అసలు సనాతనమంటే ఏమిటిన్నది అవగాహన వుందా లేదా అని అనుమానం వస్తుంది. సనాతనమంటే అసమానత, సనాతనమంటే అస్పృశ్యత, సనాతనమంటే కుల వివక్ష, సనాతనమంటే బలులు, యజ్ఞయాగాలు, బాల్యవివాహాలు, సతీసహగమనం, దళితుల సజీవ దహనం, సనాతనమంటే సమాజపు సగ భాగపు అణచివేత, ఆధిపత్య హింస, శ్రామికుల పీడన. సనాతనమంటే నిచ్చెనమెట్ల వ్యవస్థ. సనాతనమంటే వర్తమానాన్ని గతం అజమాయిషీ చేయడం, సనాతనమంటే భవిష్యత్తుకు అవరోధం. ఏ కొందిరి మనోభావాలో దెబ్బ తింటాయంటే, వారు తప్పక వారి ఆలోచనా సరళిని మార్చుకోవాల్సి వుంటుంది. పైన చెప్పినవన్నీ నిజాలే కదా? నిజాలు కాదు, అబద్ధాలు అని ఎవరైనా నిరూపించదలిస్తే నిరూపించిన తర్వాత మాట్లాడాలి. సమకాలీనంలో కూడా సనాతనం చేసే అనర్థాలెలా వుంటాయో చూడండి. ఎప్పుడో మొదలైన కుంభమేళాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి కదా?

1760 హరిద్వార్ కుంభమేళాలో శైవులైన గోసాయన్లకు, వైష్ణవులైన బైరాగులకు మధ్య కలహాలు చెలరేగి ఇరువైపులా వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. మరాఠా పీష్వాల నాటి ఒక రాగి ఫలకం మరికొన్ని భయంకరమైన విషయాలు వెల్లడించింది. 1789లో నాసిక్ కుంభమేళాలో సుమారు 12 వేల మంది మరణించారు. కారణం శైవులు వైష్ణవులు హోరాహోరీగా పోట్లాడుకొని, కోపాలు, రోషాలు చల్లారక చంపుకోవడం దాకా వెళ్ళింది. మేమంటే మేం ముందు స్నానం చేయాలని గొడవపడి, అది పెద్దదై శత్రువుల్లాగా ఒకరినొకరు చంపుకొన్నారు. ఇరుపక్షాల వారు కలిసి మొత్తం 12 వేల మంది పుణ్యస్నానాల పేరుతో ప్రాణాలు త్యాగం చేశారు. మతం పిచ్చి తలకెక్కితే అంతే! అలాగే మరి కొంత కాలానికి 1796 హరిద్వార్ కుంభమేళాలో మరోసారి హింస చెలరేగింది. ఉవులకు, ఉదాసీలకు మధ్య సామాను రవాణాకు సంబంధించి, వారి వారి హక్కులకు సంబంధించి సహనం కోల్పోయిన భక్తులు యుద్ధ వీరులైపోయారు. భక్తులు మానవత్వం మీద చెరగని మచ్చలుగా మిగిలారు తప్పితే, మత కలహాలతో ఎవరైనా, ఎప్పుడైనా, ఎమైనా పొందగలిగారా?

లోక కళ్యాణం గురించి, ప్రశాంత జీవన మార్గం గురించి, సత్ప్రవర్తన గురించి జనానికి బోధలు చేసే సన్యాసులు, సాధువులు, బైరాగులు యుద్ధాలకు దిగడం ఏమైనా బావుందా? అంటే వారు సర్వసంగ పరిత్యాగులుగా వేషం మార్చారే గాని, తమలోని అహాన్ని జయించలేకపోయారని మనకు అర్థమవుతుంది. అలాంటి వారి నుండి సామాన్యులు నేర్చుకునేది ఏముంటుందీ? వారిని అని లాభం లేదు. సామాన్యులే వాస్తవాలు గ్రహించాలి. అలాంటి సన్యాసులు దొంగ యోగులు సమాజానికి కాదు కదా, వారికి వారే ఉపయోగం లేని వారు. అలాంటి వారిని సామాన్యులు నమ్మకూడదు. వారి బూటకపు ఆధ్యాత్మికతకు ప్రభావితులు కాకూడదు. అలాంటి వారిని దూరం పెట్టాలి. సమాజ శ్రేయస్సుకు పాటుపడిన మహనీయుల గూర్చి తెలుసుకొంటూ వుండాలి. వారి మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తూ వుండాలి. దైవమే లేనప్పుడు దైవం పేరు చెప్పి, సంస్కృతి, సంప్రదాయాల పేరు చెప్పి, మోసం చేసే వారిని నమ్మడం అవసరమా? ఆలోచించాలి కదా?

మన దేశంలో పరిస్థితి ఎలా వుందంటే పెళ్ళాన్ని చంపినోడు సద్గురువు అయ్యాడు. పెళ్ళాన్ని వదిలేసినోడు విశ్వగురువు అయ్యాడు. చిన్న విషయం కూడా నేర్చుకొందామన్న తపన లేనోళ్ళంతా ఈ దేశంలో గురువులు కావాలని తహతహలాడుతుంటారు. అసలైతే వేలి ముద్రగాడు, కాని బింకంగా పరీక్షలపై చర్చ అంటూ వచ్చి కూర్చుంటాడు. MODI ఇంటి పేరు కాదు, ఆయన విద్యార్హతలు. మాస్టర్ ఆఫ్ డెవలపింగ్ ఇండియా అని ఆయన అనుయాయులు ప్రచారం చేసుకొంటున్నది నిజం. కాని, హైస్కూల్ చదువు పూర్తి చేయని వాడు లోపాయికారిగా ఎం.ఎ డిగ్రీ సంపాదించాడని ఈ దేశ ప్రజలకు తెలుసు. డబ్బు గుప్పించి నమ్మకంగా పడి వుండే వాణ్ణి రెండుసార్లు ప్రధాని సీట్లో కూర్చోబెట్టిన కార్పొరేట్లకు తెలుసు. అందుకే ఆయన వారికి అతి విధేయుడుగా వున్నారు. బిబిసి డాక్యుమెంటరీయే కాదు, ప్రపంచ వ్యాప్తంగా 14 అంతర్జాతీయ పత్రికలు ఈయన అసమర్థత గూర్చి పూర్తి వివరాలు వెల్లడించాయి. “కుట్ర చేయడం ఎంత తెలివిగా చేయాలంటే ఎదుటివాడికి ఏ మాత్రం తెలియకూడదు. పైగా తనకు తానుగా వచ్చి కుట్రలో ఇరుక్కోవాలి. బలై, భస్మమైపోవాలి” అని అన్నాడు విన్సెంట్ చర్చిల్. చర్చిల్ ఎప్పుడో చెప్పిన విషయాన్ని ఈ దేశ ప్రధాని ప్రజల మీద ప్రయోగిస్తున్నాడు. నిజం చెప్పుకోవాలంటే విపక్షాల అనైక్యత వల్ల ఆయన కొనసాగాడు తప్పించి, స్వీయ ప్రతిభతో రాణించింది ఎప్పుడూ, ఎక్కడా? గుజరాత్ మణిపూర్ గాయం. దేశమంతా గాయాలమయమైపోతోంది. నిజమే! ఈ విషయాలు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి!

దేశం కోసం, ధర్మం కోసం ఈ దేశ ప్రధాని చేస్తున్న అనేక సంస్కరణల్లో గ్యాస్ సిలిండర్ ధర పెంచడం కూడా ఒకటి అని ఆ ఫలానా పార్టీ నాయకులు తెగ ప్రచారం చేస్తున్నారు. వారి వాదన ఏమిటో, ఎంత సబబుగా వుందో ఆలోచించండి. విషయం మీకే బోధపడుతుంది “సిలిండర్లలో నింపే గ్యాస్ భూమి లోపలి నుండి తీస్తారు. అలా గ్యాస్ తీయడం వల్ల మొక్కలకు లోపలి నుండి అందాల్సిన ఆక్సిజన్ అందదు. దాని వల్ల చెట్లు పెరగవు. సుమారుగా ఒక రాష్ట్రానికి 54 లక్షల సిలిండర్లు అవసరమవుతాయంటే ఒక దేశం మొత్తానికి ఎన్ని కావాలో లెక్క కట్టండి. గ్యాస్ సిలిండర్ ధర పెంచడం వల్ల, భారం మోయలేక చాలా మంది కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళతారు. వారు అక్కడ శుభ్రమైన గాలి పీల్చుకొంటారు. దాని వల్ల మేలు జరిగినట్టే కదా? వంట చెరకు కొట్టి తెచ్చకొని కట్టెల పొయ్యి మీద వంట చేసుకొంటారు. కట్టెల పొయ్యి వల్ల పొగ వస్తుంది. ఆ పొగ వాతావరణంలో ఎక్కువ శాతంగా వున్న ఆక్సిజన్‌ను తగ్గిస్తుంది. అంటే, దాని వల్ల వాతావరణ సమతుల్యం కాపాడబడుతుంది కదా? దాని వల్ల మేలు జరిగినట్టే కదా? కట్టెల పొయ్యి మీద వంట చేసుకొన్న మన పూర్వీకులు రోగాలు, రొష్టులు లేకుండా ఆరోగ్యంగా వుండేవారు కదా? కట్టెల పొయ్యి ఉపయోగంలో లేనందువల్లనే ఈ రోజుల్లో రోగాలు నానాటికీ ఎక్కువవుతున్న విషయం అందరూ గ్రహించాలి! ఇవన్నీ దృష్టిలో వుంచుకొని, ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసమే మోడీ సిలిండర్ ధర పెంచారు. ఆయన ఏ పని చేసినా దేశం కోసం, ధర్మం కోసమే చేస్తారన్నది ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి!” ఫలానా పార్టీ వారు చేస్తున్న ప్రచారంలో నిజానిజాలు దేశ ప్రజలే గ్రహించుకోవాలి! దేశం ఎంత ముందుకు పోతోందన్నది బేరీజు వేసుకోవాలి!!

“దేశమును ప్రేమించుమన్న/ మంచి అన్నది పెంచుమన్న” అన్న గురజాడ అప్పారావు (1862 1915) మనకు తెలుసు. “మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును” అని అన్నది కూడా ఆ మహానుభావుడే. “చెట్టాపట్టాల్ పట్టుకుని/ దేశస్థులంతా నడవవలెనోయ్/ అన్నదమ్ముల వలెను జాతులు/ మతములన్నియు మెలగవలెనోయ్‌” అని ఆశించారాయన! అందుకు వ్యతిరేకమైన భావజాలాన్ని ఇప్పుడు ఒక గుజరాత్ అప్పారావు ద్వేషభక్తి గీతం పాడుతున్నాడు. జ్యోతిబసు పేరుతో ఎవరో నాకు ఆ పేరడీ గేయం పంపించారు. అది నా పాఠకుల కోసం ఇక్కడ పొందు పరుస్తున్నాను. “మతమును ప్రేమించుమన్న/ హింసయన్నది పెంచుమన్న / వట్టి మాటలు చెప్పుకోవోయ్/ చేయు మేలుని కట్టిపెట్టోయ్/ దేశాభిమానమె నాకెకద్దని / వట్టి గొప్పలే చెప్పుకోవోయ్/ దేశమంటె జనం కాదోయ్/ దేశమంటే మతం మయమోయ్// హిందు మతమె రాజ్యమేలగ/ దారిలో నువు పాటు పడవోయ్/ తతిమ జాతులు మతములన్నీ/ అణిగిమణిగీ మెలగవలెనోయ్// స్వంతలాభమె అంతయనుకొని/ ప్రజలనందరి ముంచవలెనోయ్/ జాతి ఆస్తులు కట్టగట్టి/ దత్తపుత్రుల కట్టబెట్టోయ్// విజ్ఞాన మంతయు రాతి యుగపు/ గ్రంథమయమని బొంకవలెనోయ్/ రోదసీ నౌకకి సైతం/ దిష్ట టెంకాయ్ కొట్టవలెనోయ్// అంబేడ్కరు, గాంధీ ఇజాలకు/ పైపై ఉప్పు కొట్టవలెనోయ్/ మత సామరస్యం చావు కోసం/ లోనగోతులు తీయవలెనోయ్‌” అధికారంలో వున్నవారు పాడుతున్న ఈ ద్వేషభక్తి గేయం దేశానికి ఎంతగా గాయం చేస్తుందో.. సామాన్య పౌరులు అర్థం చేసుకోవాలి! భారత్, జోడో నఫ్రత్ ఛోడో! భారత దేశ సమగ్రతను కాపాడదాం, విద్వేష భావాన్ని విడనాడుదాం!! ’ ఇదే నేటి మన కర్తవ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News