Monday, April 29, 2024

తెలంగాణలో గిరిజన సంస్కృతికి పెద్ద పీట

- Advertisement -
- Advertisement -

మ్యూజియంలలో గిరిజన మూలాలు
భవిష్యత్ తరాలకు దిక్సూచిగా
దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ మ్యూజియంలు

Big platform for tribal culture in Telangana
మన తెలంగాణ / హైదరాబాద్ : అంతరించి పోతున్న గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను భావి తరాలకు తెలియజేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంతో గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను, గిరిజన తెగల చరిత్ర, ఆచార వ్యవహారాలను కళ్ళకు కట్టినట్టు గిరిజన మ్యూజియంలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్షానికి గురైన తెలంగాణ గిరిజన, ఆదివాసిల జీవన శైలి, ఆచార వ్యవహారాలను వెలికి తీసి భావి తరాలకు అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజన మ్యూజియంల ఏర్పాటుకు అత్యంత ప్రాముఖ్యత నివ్వడంతో నేడు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మ్యూజియంలు ఏర్పాటు అయ్యాయి.

నేడు ప్రపంచ మ్యూజియం డే నిర్వహించుకుంటున్న సందర్భంగా తెలంగాణలో మ్యూజియంలపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. గిరిజనులకే గాకుండా సమాజంలో ఎవరికీ తెలియని గిరిజన ఆచార వ్యవహారాలు, చరిత్రను గిరిజన మ్యూజియంలు ఆవిష్కరిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ఏకైన గిరిజన మ్యూజియం ఉండేది. అందులోనూ తెలంగాణ గిరిజన తెగలు, వారి ఆచార వ్యవహరాలు, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు తగిన ప్రాముఖ్యం లభించలేదు. ఇలాంటి తరుణంలో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం, గిరిజన మంత్రిత్వశాఖ వీటిపై ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడి గిరిజన తెగల చరిత్రను వెలుగులోకి తెచ్చింది. హైదరాబాద్‌లోని ప్రధాన గిరిజన మూజియంను పూర్తిగా వందశాతం తెలంగాణ గిరిజన కళాఖండాలు, ఆచార వ్యవహరాలతో ఆధునీకరించడం జరిగింది.

ఆరేళ్ళలో ఆరు మ్యూజియంలు

ఆరేళ్ళలో కాలంలో కొత్తగా ఆరు కొత్త మ్యూజియంలను ఏర్పాటు చేయడం ద్వారా గిరిజన మ్యూజియంలకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొమరం భీం మెమోరియల్ మ్యూజియంను 2016లో ఏర్పాటు చేశారు. కొమరం భీం అమరుడైన జోడేఘాట్‌లో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. 2018లో మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆదివాసి మ్యూజియంను ఏర్పాటు చ ఏశారు. గిరిజనులకు ఆదివాసీలకు, సామాన్య ప్రజలకు సమ్మక్క, సారలమ్మ గద్దెల గురించి మాత్రమే తెలిసేవి ఈ మ్యూజియంను ఏర్పాటు చేసి వారి వంశీయుల చరిత్రను ఘట్టాల రూపంలో శిల్పాలతో ప్రదర్శించడం జరిగింది. వస్త్ర, సంస్కృతి, తదితర అంశాలను ఈ మ్యూజియంలో ప్రదర్శించారు. భద్రాచలం ఐటిడిఎ కాంప్లెక్స్‌లో కోయ, కొండరెద్దుల జాతుల సంస్కృతి, సాంప్రదాయాలు, వస్తు విశేశాలను ప్రదర్శించడం జరిగింది. నాగర్‌కర్నూలు జిల్లాలో మన్ననూరు వద్ద చెంచు లక్ష్మి మ్యూజియంను ఏర్పాటు చేశారు.

చెంచు గిరిజన జీవిత చరిత్ర, సంస్కృతి ని చాటిచెప్పే శిల్పాలను ప్రధర్శించారు. హైదరాబాద్‌లోని నెహ్రూ సెంటనరీ ట్రైబల్ మ్యూజియంను పూర్తిగా ఆధునీకరించి వంద శాతం తెలంగాణ గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రదర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా లో కోయ గిరిజన మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఇక్కడ కోయ తెగకు సంబంధించిన జీవన విశేషాలును ప్రదర్శించారు. బంజారాహిల్స్ లో రెండు గిరిజన కల్సరల్ హబ్‌లను ఏర్పాటు చేశారు. ఆదివాసీ భవన్, బంజారా భవన్‌లను ఏర్పాటు చేయడం ద్వారా గిరిజనుల సంస్కృతిని ప్రదర్శించబోతున్నారు. ఈ రెండు భవన్‌లు ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయి. హైదరాబాద్ ఆబిడ్స్‌లో రాంజీ గోండు మెమోరియల్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్వాతంత్రోద్యమంలో గిరిజన నేతల పోరాటాలను ఈ మెమోరియల్‌లో పొందుపరుచనున్నారు. ఇది పూర్తిగా కేంద్ర నిధులతో ఏర్పాటు కోబోతుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు మంజూరు చేసింది. త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News