Wednesday, May 1, 2024

రాష్ట్ర ‘పత్ని’పై రచ్చ రచ్చ..

- Advertisement -
- Advertisement -

రాష్ట్రపతిని అవమానించారంటూ అధికారపక్షం ఆగ్రహం
సోనియా క్షమాపణ చెప్పాలంటూ బిజెపి డిమాండ్
స్మృతి ఇరానీ, సోనియా మధ్య మాటల యుద్ధం 
ఉభయ సభలు వాయిదా
తప్పు ఒప్పుకున్న అధిర్
సోనియాను లాగొద్దని మండిపాటు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవిని అగౌరవపరిచేలా కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌధరి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గురువారం బిజెపి సభ్యులు లోక్‌సభలోపెద్ద ఎత్తున నిరసనకు దిగి నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని అవమానపరిచిందని, ఆ పార్టీ లోక్‌సభా పక్షనేత అధిర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధ్యక్షురాలు వెంటనే క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. అత్యున్నత పదవిలో ఉన్న మహిళకు జరిగిన అవమానాన్ని సోనియాగాంధీ ఆమోదించారని స్మృతిఇరానీ విరుచుకుపడ్డారు. ఆమె బలహీన వర్గాలకు వ్యతిరేకమంటూ దుయ్యబట్టా రు. అధికార, విపక్షాల నినాదాలతో సభ దద్దరిల్లిం ది. దీంతో ఈ రోజు కూడా పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. మరో పక్క కొవిడ్‌నుంచి కోలుకుని సభకు వచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తీవ్రంగా స్పందించారు. దీనిపై పార్లమెంటు ప్రాంగణంలో ధర్నా చేస్తున్న బిజెపి సభ్యులకు ఆమె మద్దతు పలికారు. ‘ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన అభ్యంతరకర వ్యాఖ్య. దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. ‘రాష్ట్రపత్ని’ అంటూ అధిర్ రంజన్ చౌధరి వాడిన పదం ఈ దుమారానికి దారి తీసింది. కాగా ఈ నిరసనల నేపథ్యంలో ఆయన వెంటనే క్షమాపణలు చెప్పారు. పొరబాటున నోరు జారినట్లు అంగీకరించారు. ధరల పెరుగుదల, జిఎస్‌టి, అగ్నిపథ్‌లనుం చి దేశప్రజల దృష్టిని మరల్చేందుకు బిజెపి ఈ విషయాన్ని పెద్దది చేస్తోందని విమర్శించారు. కాగా ఈ నిరసనలపై సోనియా స్పందిస్తూ అధిర్ రంజన్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని మీడియాకు వెల్లడించారు.
నువ్వు నాతో మాట్లాడొద్దు.. స్మృతి ఇరానీకి సోనియా హెచ్చరిక
రాష్ట్రపతి వివాదంపై అధికార, విపక్షాల సభ్యుల నినాదాలతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత కూడా దీనిపై సోనియా క్షమాపణలు చెప్పాలంటూ బిజెపి సభ్యులు లోక్‌సభలో కొంత సేపు నినాదాలు చేశారు. ఈ క్రమంలో సోనియాగాంధీ బిజెపి నాయకురాలు రమాదేవి వద్దకు వెళ్లి మాట్లాడుతుండగా మధ్యలో మంత్రి స్మృతి ఇరానీ జోక్యం చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ అధినేత్రి మొదట్లో ఆమెనుపట్టించుకోవడానికి యత్నించారు.అయినా రెచ్చగొట్టడంతో ‘నువ్వు నాతో మా ట్లా డొద్దు’ అంటూ తీవ్ర స్వరంతో ఆమెను వారించారు. ఈ దశలలో టిఎంసి ఎంపిలు మహువా మొ యిత్రా, అపురూప పొద్దార్, ఎన్‌సిపి ఎంపి సుప్రి యా సూలె జోక్యం చేసుకుని సోనియాను బిజెపి సభ్యులనుంచి దూరంగా తీసుకెళ్లారు. అదే సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ పరిస్థితిని చక్కదిద్దారు. కాగా రమాదేవి తనకు తెలుసు కాబట్టి ఆమెతో మాట్లాడడానికి మాత్రమే తాను వెళ్లానని సోనియా చెప్పినట్లు సమాచారం. కాగా సోనియా గాంధీ సభలో ఒక దశలో భయపట్టే విధంగా ప్రవర్తించారని, తమ పార్టీకి సం బంధించిన కొంత మంది సభ్యులను బెదిరించారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు పశ్చాత్తాపం వ్యక్తం చేయడానికి బదులు మరింత దూకుడుతనం ప్రదర్శించారని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. అయితే సోని యా గాంధీ బెదిరించిన తమ పార్టీ సభ్యులెవరో ఆమె వెల్లడించలేదు కానీ ఆమె స్మృతి ఇరానీ గురించే ఈ మాటలున్నారని అర్థమవుతోంది.
కావాలంటే నన్ను ఉరి తీయండి.. మేడమ్‌ను లాగకండి: అధిర్
కాగా తాను చేసిన వ్యాఖ్యలపై అధిర్ రంజన్ చౌధరి మరోసారి వివరణ ఇచ్చారు. ‘రాష్ట్రపతిని అవమానించే ఉద్దేశం నాకు లేదు. అది పొరపాటుగా జరిగింది. పూర్తిగా నా తప్పే. ఒక వేళ రాష్ట్రపతి అవమానంగా భావిస్తే నేరుగా వెళ్లి క్షమాపణలు చెప్తాను. నేను చేసిన పొరపాటుకు కావాలంటే నన్ను ఉరితీయండి. శిక్షకు నేను సిద్ధమే. అంతేకానీ ఈ వివాదంలోకి మేడమ్(సోనియాగాంధీ)ను ఎందుకు లాగుతున్నార’ని అన్నారు. అంతేకాదు, బిజెపిపై ఆయన ధ్వజమెత్తుతూ ఈ ‘ కపటవాదుల’( హిపోక్రైట్స్)కు క్షమాపణ చెప్పనని కూడా ఆయన స్పష్టం చేశారు.
సోనియాకు విపక్ష సభ్యుల మద్దతు
కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పట్ల బిజెపి సభ్యులు ప్రవర్తించిన తీరుపట్ల పలువురు కాంగ్రెసేతర విపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.75 ఏళ్ల వయసుగల సీనియర్ మహిళా నేతను నక్కల గుంపులాగా చుట్టుముట్టి అడ్డుకున్నప్పుడు తాను సభలోనే ఉన్నాని టిఎంసి ఎంపి మహువ మొయిత్ర ఒక ట్వీట్‌లో ధ్వజమెత్తారు. మరో సీనియర్ మహిళా ప్యానెల్ స్పీకర్‌తో మాట్లాడడానికి సోనియా వెళ్లినప్పుడు ఇదంతా జరిగిందని పేర్కొన్నారు. బిజెపి అబద్ధాలు, తప్పుడు కథనాలను పత్రికల్లో చదవడం ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు. కాగా ఈ రోజు సభలో దురదృష్టకరమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయని ఎన్‌సిపి సభ్యురాలు సుప్రియా సూలె అన్నారు. సభ వాయిదాపడిన తర్వాత అనవసరంగా సోనియాకు వ్యతిరేకంగా బిజెపి సభ్యులు నినాదాలు చేయడం విని దిగ్భ్రాంతి చెందానని ఆమె అన్నారు. సభా మర్యాదను, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆమె అన్నారు. శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది కూడా సోనియాగాంధీ పట్ల బిజెపి సభ్యులు ప్రవర్తించిన తీరు పట్ల తీవ్ర అభ్యంతరం తెలియజేశారు.
అధిర్ రంజన్‌కు ఎన్‌సిడబ్లు నోటీసులు
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’గా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఎంపి అధిర్ రంజన్ చౌధురికి జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లు) గురువారం నోటీసులు జారీ చేసింది. కమిషన్ ఎదుట హాజరయి లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఎంపిని ఎన్‌సిడబ్లు కోరింది. ఆగస్టు 3న ఉదయం 11.30 గంటలకు హాజరు కావాలని జాతీయ మహిళా కమిషన్ అధిర్‌కు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేసిన అధిర్‌రంజన్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కూడా మహిళా కమిషన్ లేఖ రాసింది. ఎంపి వ్యాఖ్యలను ఖండిస్తూ ఎన్‌సిడబ్లు సహా 12 రాష్ట్రా మహిళా కమిషన్లు ఒక సంయుక్త ప్రకటన విడుద చేశాయి. విశాఖపట్నంలో జరుగుతున్న మహిళా కమిషన్ల త్రైమాసిక సమావేవానికి హాజరయిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్లు ఈ మేరకు సంయుక్తంగా ఒక ప్రకటనను విడుదల చేశాయని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ ఒక ట్వీట్‌లో తెలియజేశారు.

BJP Fires on adhir Ranjan Comments on President

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News