Saturday, April 27, 2024

తలకిందులుగా వేలాడగట్టి కాల్చిన ఇనుప చువ్వతో వాతలు

- Advertisement -
- Advertisement -

ఇండోర్ అనాథాశ్రమంలో పిల్లలపై సిబ్బంది దాష్టీకం

ఇండోర్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోగల ఒక అనాథాశ్రమంలో 21 మంది పిల్లలపై అక్కడి సిబ్బంది అత్యంత దారుణంగా చిత్రహింసలకు పాల్పడినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. గత వారం ఆ అనాథాశ్రమాన్ని శిశు సంక్షేమ కమిటీ(సిడబ్లుసి)కి చెందిన బృందం ఆకస్మిక తనిఖీ జరిపిన సందర్భంగా ఈ దారుణాలు వెలుగుచూశాయి. చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా సిబ్బంది తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారని అనాథాశ్రమం పిల్లలు కమిటీ సభ్యులకు తెలియచేశారు.

తమను తలకిందులుగా వేలాడగట్టి, వేడి ఇనుప చువ్వతో వాతలు పెడుతున్నారని, వివస్త్రలను చేసి ఫోటోలు తీసి బెదిరిస్తున్నారని బాధిత పిల్లలు కమిటీ సభ్యులకు తెలిపారు. ఎండు మిరపకాయలను కాల్చి ఆ పొగ తాము పీల్చేలా హింసించేవారని కూడా పిల్లలు ఫిర్యాదు చేశారు. అనాథాశ్రమానికి చెందిన ఐదుగురు ఉద్యోగులపై పోఈసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్యాంట్లో మలవిసర్జన చేసినందుకు ఒక నాలుగేళ్ల పిల్లాడిని బాత్‌రూములో మూడు రోజులపాటు నిర్బంధించి భోజనం పెట్టకుండా మాడ్చినట్లు కమిటీ సభ్యుల వద్ద బాధితులు వాపోయారు.

వాత్సల్యాపురం జైన్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ అనాథాశ్రమం జువెనైల్ జస్టిస యాక్ట్ కింద రిజిస్టర్ కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ట్రస్టుకు ఇండోర్‌తోపాటు బెంగళూరు, సూరత్, జోధ్‌పూర్, కోల్‌కతాలో కూడా అనాథాశ్రమాలు ఉన్నాయని వారు తెలిపారు. పిర్యాదు అందిన వెంటనే అనాథాశ్రమాన్ని సీజ్ చేసి అందులోని పిల్లలను ప్రభుత్వ వసతిగృహాలకు పంపడం జరిగిందని ఇండోర్ అదనపు పోలీఉ కమిషనర్ అమరేంద్ర సింగ్ తెలిపారు.

పిల్లలను క్రూరంగా హింసించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పిల్లల శరీరాలపై ఉన్న గాయాల గుర్తులను ఫోటోలు తీసి ఫిర్యాదుతోపాటు పోలీసులకు కమిటీ బృందం అందచేసింది. ఇండోర్ అనాథాశ్రమంలో ఉన్న పిల్లలు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్‌కు చెందిన వారని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News