Wednesday, May 8, 2024

శ్రీరామ విగ్రహ ప్రతిష్ట తరువాత అయోధ్యకు అందరం వెళ్తాం : సిఎం షిండే

- Advertisement -
- Advertisement -

ముంబై : జనవరి 22న అయోధ్యలో జరగనున్న శ్రీరామ విగ్రహ ప్రతిష్టకు హాజరు కావడం లేదని, మంత్రులు, ఎమ్‌ఎల్‌ఎలు, ఎంపీలతో తరువాత అయోధ్యలో పర్యటించేలా ప్రణాళికలు చేసుకున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆదివారం వెల్లడించారు. ముంబైలో ఆదివారం నిర్వహించిన టాటా మారథాన్ సందర్భంగా విలేఖరులతో ఆయన మాట్లాడారు. కేవలం కొద్ది మందితో ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లే బదులు , తరువాత రాష్ట్ర మంత్రులు, ఎమ్‌ఎల్‌ఎలు, ఎంపీలు అందరితో కలిసి వెళ్లడమే బాగుంటుందని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

శ్రీరామ మందిరం తమ విశ్వాసం, గర్వకారణమని పేర్కొన్నారు. అధికారులను, భక్తులను కూడా తీసుకెళ్లాలని ఉందన్నారు. సోమవారం అయోధ్య కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం లోని అన్ని ఆలయాలను పరిశుభ్రం చేయాలని, దీపాలతో అలంకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. డిప్యూటీ సిఎం ఫడ్నవిస్ కూడా నాగపూర్ విలేఖరులతో మాట్లాడుతూ ఫిబ్రవరిలో అయోధ్య రామసేవకు తాము వెళ్లనున్నట్టు ఆదివారం ఉదయం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News