Sunday, May 12, 2024

విద్యుత్, ఆర్టీసి శాఖలపై సిఎం ఉన్నత స్థాయి సమీక్ష

- Advertisement -
- Advertisement -

విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్లు, ప్రస్తుత పరిస్థితులపై
ముఖ్యమంత్రి రేవంత్ ఆరా

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్, ఆర్టీసి శాఖలపై డా.బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, ఇంధన శాఖ సునీల్ శర్మ, సింగరేణి సిఎండి శ్రీధర్, సిపిడిసిఎల్ సిఎండి రఘుమా రెడ్డి, ఎన్పీడిసిఎల్ సిఎండి గోపాల్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ సమీక్షకు ట్రాన్స్ కో, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు హాజరుకాలేదు.

విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోళ్లపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోళ్లపై ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. 2014 జూన్ 2 కంటే ముందు పరిస్థితులు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మరోవైపు సిఎండి ప్రభాకర్ రావు గైర్హాజరు కావడంతో ఆయన ఎందుకు రాలేదని అధికారులను అడిగి తెలుసుకున్నట్టుగా తెలిసింది.

నాకు ఎలాంటి సమాచారం లేదు: సిఎండి ప్రభాకర్ రావు
సచివాలయంలో జరిగిన విద్యుత్ శాఖ సమీక్షకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ట్రాన్స్‌కో, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి పిలిస్తే వెళ్లకుండా ఎందుకు ఉంటానని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ శాఖ నుంచి కానీ, సిఎంఓ నుంచి కానీ తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని ఆయన పేర్కొన్నారు. తనకు ఆహ్వానం అంది ఉంటే కచ్చితంగా సమావేశానికి హాజరయ్యే వాడినని ఆయన స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News