సిద్ధిపేట: జిల్లా పర్యటనలో భాగంగా దుద్దెడలో ఐటి టవర్ కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల కె చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ.. సిద్ధిపేట చాలా డైనమిక్ ప్రాంతమని, త్వరలో సిద్ధిపేటకు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రాబోతుందని చెప్పారు. దీంతోపాటు జిల్లాలోని పొన్నాల శివారులో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ను కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన భవనాన్ని పరిశీలించారు. అనంతరం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని మిట్టపల్లిలో నిర్మించిన రైతు వేదికను కెసిఆర్ ప్రారంభించారు. ఎన్సాన్పల్లిలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనాన్ని సైతం కెసిఆర్ ప్రారంభించారు. 960 పడకల జనరల్ ఆసుపత్రి భవన నిర్మాణానికి సిఎం శంకుస్థాపన చేశారు. నర్సాపూర్లో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను కెసిఆర్ ప్రారంభించారు. పైలాన్ దగ్గర సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు చేయించారు. సిద్దిపేట పట్టణంలోని చింతల్చెరువు దగ్గర అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను , రంగనాయకసాగర్ గెస్ట్హౌజ్ను సిఎం కెసిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలు, టిఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
CM KCR Inaugurate IT Tower at Duddeda in Siddipet