Saturday, April 27, 2024

పడావుకు ప్రాణం

- Advertisement -
- Advertisement -

CM KCR review on the issue of grain purchases

 

సాగునీటి సౌకర్యం, రైతుబంధుతో సాగులోకి పడావు భూములు

గ్రామాల్లోనే పూర్తిస్థాయిలో వరిధాన్యం కొనుగోలు
కరోనా ప్రమాదం ఇంకా తొలిగి పోలేదు
రైతుల శ్రేయస్సు దృష్టా ధాన్యం
కొనుగోలు ఏజెన్సీలను ఊళ్లకే పంపుతాం
అన్నదాతలు అసౌకర్యానికి గురి కాకుండా చర్యలు
పౌరసరఫరాల శాఖ ఇంకా బలోపేతం కావల్సింది
దానికి తగ్గట్టు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి
ప్రభుత్వం చెప్పినట్టుగానే రైతులు పంటలు వేయడం అభినందనీయం : సమీక్షలో ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తతంగా సాగునీటి సౌకర్యం పెరగడంలో పడావు పడ్డ భూములు కూడా సాగులోకి వస్తున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ నేపథ్యంలో రైతులు పెద్దఎత్తున పంటలు పండించగలుగుతున్నారన్నారు. అందువల్ల రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. వారు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్థిస్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు సిఎం కెసిఆర్ కరోనా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోనందున రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రభుత్వ ఏజెన్సీలను గ్రామాలకు పంపి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని తెలిపారు.

వానాకాలం ధాన్యం కొనుగోళ్ల అంశంపై బుధవారం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ మరోసారి మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా సమయంలో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు చేసిన విధంగానే ఇప్పుడు కూడా ఏజెన్సీలు రైతుల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయన్నారు. అందువల్ల మార్కెట్లకు ధాన్యాన్ని తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడొద్దని ముఖ్యమంత్రి సూచించారు. 17శాతానికి లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని ఎండబెట్టి పొల్లు, తాలు లేకుండా తీసుకొస్తే ఏ- గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,888, బి-గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,868 కనీస మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ తెలిపారు. గ్రామాల్లో వరికోతల కార్యక్రమం నెలా పదిహేనురోజులపాటు సాగుతుందన్నారు. ఈ నేపథ్యంలో కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాలశాఖల అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. మొత్తం ఎంతధాన్యం వచ్చే అవకాశం ఉంటుందనే అంశంపై పక్కాగా అంచనా వేయాలని, కొనుగోళ్ల కోసం తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

రైతుబంధు పథకం కింద ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందిస్తుండటంతో పట్టణాలకు వలస వెళ్లిన రైతులు కూడా గ్రామాలకు తిరిగివచ్చి భూములను సాగు చేసుకోవడం సంతోషకరమని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. బ్యాంకు గ్యారెంటీలు సహా రైతుల ధాన్యం అమ్మకం డబ్బు వెంటనే చెల్లించే విధంగా పకడ్భందీగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో పౌర సరఫరాలశాఖ ఇంకా విస్తృతంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని సిఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను సిఎం ఆదేశించారు. నిర్దేశిత పంటలు వేయాలని ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు 10.78 లక్షల ఎకరాల్లో కంది పంటను సాగు చేయడం అభినందనీయమని, ఆ పంటను కూడా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సెక్రటరీ స్మితా సభర్వాల్, ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మార్క్ ఫెడ్ చైర్మన్ మర గంగారెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, సివిల్ సప్లయీస్ కమిషనర్ అనిల్ కుమార్, పెద్దపల్లి జెడ్‌పి చైర్మన్ పుట్ట మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News