Sunday, April 28, 2024

జల విజయ కా’హ’ళేశ్వరం

- Advertisement -
- Advertisement -

అందుకే ఖర్చుకు వెనకాడలేదు
ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించాం, యజ్ఞంలా పూర్తిచేశాం
భావితరాల కోసం కాపాడుకుందాం
సాగునీరు లేక రైతులు దశాబ్దాలుగా అరిగోస పడ్డారు

ఏడు నెలల పాటు నీటిని పంపింగ్ చేయవచ్చు
పంపింగ్‌లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు
జలకళ ఉట్టి పడుతోంది, మన బ్యారేజీలు సముద్రాలను తలపిస్తున్నాయి
ప్రాజెక్టు సందర్శన సందర్భంగా సిఎం కెసిఆర్

రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి ఖర్చుకు వెనకాడకుండా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. దేశానికే గర్వకారణమైన దీనిని భావి తరాల కోసం కాపాడుకోవాలి. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడంలో కృషి చేసిన నీటి పారుదల శాఖాదికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులకు అభినందనలు. బ్యారేజీలో పూర్తి స్థాయి నీరు నిలువ ఉంది. ఈ ఎండాకాలం అంతా ఈ నీటితో రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, నింపాలి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్పూర్తితోనే రాష్టంలోని ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలి.- సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తయి నీటి పంపింగ్ కూడ నిరాటంకంగా జరుగుతుండడంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి ఖర్చుకు వెనకాడకుండా ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం జరిగిందన్నారు. దేశానికే గర్వకారణమైన ఈ ప్రాజెక్టును భావి తరాల కోసం కాపాడుకో వాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడం లో కృషి చేసిన నీటి పారుదల శాఖాదికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రస్తుతం బ్యారేజీల వద్ద పూర్తి స్థాయిలో నీరు నిలువ ఉందని, ఈ ఎండాకాలం అంతా ఈ నీటితో రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, నింపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ రూల్స్ రూపొందించి అమలు చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్పూర్తితోనే రాష్టంలో చేపట్టిన ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు. మంగళవారం మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని ముఖ్యమంత్రి సందర్శించారు. ముఖ్యమంత్రి సతీమణి శోభ, మంత్రులు, ఇతర నాయకులు, అధికారులతో కలిసి గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఎదురైన అనుభవాలను నెమరు వేసున్నారు. సాగునీరు లేక తెలంగాణ రైతాంగం దశాబ్దాల తరబడి గోసను అనుభవించిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే రైతులు రెండు పంటలను సమృద్ధిగా పండించేందుకు అవసరమైన సాగునీరు అందించి తీరాలని మొదట్లోనే నిర్ణయించుకున్నామని సిఎం వ్యాఖ్యానించారు. అటు ప్రాణహిత, ఇటు గోదావరి రెండు నదుల నీళ్లు కలిసిన తరువాత బ్యారెజి నిర్మాణం చేపడితే ఎక్కువ కాలం పాటు కావలసినంత నీళ్లు పంపింగ్ చేయవచ్చని వ్యూహం రూపొందించామన్నారు. వ్యాప్కోస్ తో శాస్త్రీయంగా సర్వే నిర్వహించి మేడిగడ్డ పాయింట్ వద్ద బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 16.17 టిఎంసిల నీటి నిలువ సామర్ద్యంతో దాదాపు 100 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడం వల్ల దాదాపు 7 నెలల పాటు నీటిని పంపింగ్ చేయవచ్చని అంచనా వేశామని సిఎం తెలిపారు. ప్రస్తుతం తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతున్నదన్నారు. 99.7 మీటర్ల ఎత్తులో 16.17 టింఎంసిల నీరు నిలువ ఉన్నదన్నారు. నీటి పంపింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరుగుతుండడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. మెడిగడ్డ పాయింట్ నుండి 54 కిలోమీటర్ల వరకు ప్రాణహితలో, 42 కిలోమీటర్ల వరకు గోదావరిలో నీరు నిలువ ఉండడంతో జలకళ ఉట్టి పడుతున్నదన్నారు. మన బ్యారేజీలు ప్రస్తుతం సముద్రాలను తలపిస్తున్నాయన్నారు.

ఏ సమయం ఎట్ల వచ్చినా మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి, మిడ్ మానేరు, ఎల్‌ఎండి, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు ప్రతీ ఏటా నీరందుతుందని సిఎం కెసిఆర్ మరోసారి భరోసా ఇచ్చారు. నిజాంసాగర్ కూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీరందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అవసరమైన పక్షంలో ఎస్‌ఆర్‌ఎస్‌పి కూడా ఈ ప్రాజెక్టు నుండే నీటి పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖ చిత్రాన్ని మార్చి వేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్పూర్తితోనే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన తూపాకుల గూడెం బ్యారేజి, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన దుమ్ముగూడెం బ్యారెజీ నిర్మాణాలు శరవేగంగా జరగుతు న్నాయన్నారు. ఈ ప్రాజెక్టులన్నీంటిని త్వరితిగతిన పూర్తి చేసి రైతుల సాగునీట గోసను శాశ్వతంగా రూపు మాపలన్నది ప్రభుత్వ లక్ష్యమని సిఎం కెసిఆర్ తెలిపారు.


కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఓ యజ్ఞంలా చేపట్టామని సిఎం కెసిఆర్ అన్నారు. 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న సమయంలో కూడా వేలాది మంది కార్మికులు పనిలో నిమగ్నమై 365 రోజులు పనిచేశారన్నారు. భూసేకరణతో పాటు వివిధ క్రాసింగ్ లకు సంబంధిచిన అంశాలను అధికారులు సమయోచితంగా, సమర్ధంవంతంగా పరిష్కరించారని ప్రశంసించారు. మొత్తంగా రాష్ట్ర రైతాంగానికి ఎంతో ఆవశ్యకమైన ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి వినియోగంలోకి రావడం ఎంతో సంతోషంగా వుందన్నారు. రాష్ట్ర రైతుల కల నెరవేరినందుకు, సాగునీటి సమస్య తీరుతున్నందుకు సంతృప్తిగా ఉందన్నారు. “మేడిగడ్డ బ్యారేజీ, తుపాకుల గుడెం బ్యారేజి, దుమ్ముగూడెం బ్యారేజీల వల్ల కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆపరేషన్ రూల్స్ రూపొందించాలి. సమయానుగుణంగా రూల్స్ ను అమలు చేయాలి” అని ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగు ల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ సలహాదా రు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటిపారుదల శాఖ ఇఎన్‌సిలు మురళీధరర్ రావు, వెంకటేశ్వర్లు, పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేత, పెద్దపలి-వరంగల్ రూరల్ జెడ్‌పి చెర్ పర్సన్లు పుట్ట మధు, గండ్ర జ్యోతి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, శాసనసభ్యులు గండ్ర వెంకట్రామరెడ్డి, పోర్తిక చంద ర్, దివాకర్‌రావు, మనోహర్‌రెడ్డి, ఎంఎల్‌సిలు పురాణం సతీష్, నారదాసు లక్మ్తణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరున్ని దర్శించుకున్న సిఎం దంపతులు

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా సిఎం కెసిఆర్ దంపతులు మంగళవారం తొలుత దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సతీ సమేతంగా ఆ జంట ఆలయ ప్రాంగణంలోకి రాగానే వేద పండితులు ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతించారు. ఆ తర్వాత వారు కాళేశ్వర ముక్తేశ్వరున్ని దర్శించి అభిషేకాది అర్చనలు చేశారు. అనంతరం వేద పండితులు సిఎం దంపతులకు ఆశీర్వచనం చేసి శాలువలతో సత్కరించి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అక్కడి నుండి పుష్కరఘాట్‌కు వెళ్ళి గోదావరిలో నాణాలు వేసి పసుపు, కుంకాలతో పాటు పాలను ఆ పవిత్ర జలధారలో కలిపారు. ఉదయం 11.20 గంటలకు చేరుకున్న ఆయన ఆ పుణ్యధామంలో 11.56 దాకా గడిపారు.

CM KCR Visits Kaleshwaram Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News