Wednesday, May 1, 2024

6వ తేదీ నుంచి అల్పాహారం

- Advertisement -
- Advertisement -

జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎస్‌శాంతి కుమారి

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 6 వ తేదీ నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పధకం ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. బతుకమ్మ పండగను పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ, యువతలో క్రీడానైపుణ్యాన్ని పెంపొందించేందుకు క్రీడా పరికరాల కిట్లను అందచేసే కార్య క్రమాలను ముమ్మరంగా కొనసాగించాలన్నారు. బతుకమ్మ చీరెల పంపిణి, యువతకు స్పోర్ట్ కిట్ ల అందజేత, ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలుపై సిఎస్ శాంతి కుమారి మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్లతో పాటు సంబంధిత కార్యదర్శులు, కమీషనర్లు, ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో ఈ క్రింది ఆదేశాలను సిఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లకు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 6వ తేదీ నుండి అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయలని అధికారులను ఆదేశించారు. సిఎం కెసిఆర్ సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహార పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుండి ఒక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారుల సహకారంతో ఎంపిక చేసి అల్పాహారం కార్యక్రమ ప్రారంభోత్సవంలో రాష్ట్రమంత్రులు, స్థానిక శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ పథకాన్ని సిఎం కెసిఆర్ రంగారెడ్డి జిల్లాలో ప్రారంభిస్తారని, సిఎం కెసిఆర్ ప్రారంభోత్సం అనంతరం అన్ని జిల్లాల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. నగర ప్రాంతాల్లో ఈ అల్పాహారాన్ని అక్షయ పాత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేస్తుందని, గ్రామీణ ప్రాంతాలొ స్థానిక స్వయం సహాయక బృందాల సహకారంతో ఏర్పాటు చేయాలన్నారు. బతుకమ్మ పండగ పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణీని చేపట్టామన్నారు. ఇప్పటికే 85 లక్షల బతుకమ్మ చీరెలను వివిధ జిల్లాలకు పంపించామని తెలిపారు. ఈ నెల 14 వతేదీ వరకల్లా బతుకమ్మ చీరెల పంపిణీని పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలోని యువతలో క్రీడా నైపుణ్యాలను మరింత పెంపొందించేందుకుగాను యువతకు క్రీడా పరికరాల కిట్‌లను పంపిణీ చేపట్టామన్నారు. రాష్ట్రంలో 18 వేల స్పోర్ట్ కిట్ల పంపిణీ. ప్రతీ కిట్‌లో టీ- షర్ట్ తో పాటు నాలుగు క్రీడా పరికరాలుంటాయన్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ స్పోర్ట్ కిట్ ల పంపిణీ మరింత వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి ప్రతీ రోజూ నివేదికలు సమర్పించాలని తెలిపారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, చేనేత, జౌళి శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, చేనేత శాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసేన, స్పోరట్స్ డైరెక్టర్ కొర్ర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News