ప్రభుత్వానికి భారమైనా పేదల కోసం సిఎం హామీ
వచ్చే నెలలో మూడేళ్ల ఎఆర్ఆర్ల నివేదికలను ఈఆర్సీలకు సమర్పించాలని డిస్కంల నిర్ణయం !
మనతెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్ఎంసి ఎన్నికల్లో సిఎం కెసిఆర్ పేదలకు లబ్ధి చేకూరేలా ఉచిత విద్యుత్ను అందిస్తానని పేర్కొనడంతో త్వరలో దానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సబ్సిడీలను ప్రభుత్వం సక్రమంగా డిస్కంలకు చెల్లిస్తున్నా రానున్న రోజుల్లో ప్రభుత్వంపై మరింత అధిక భారం పడే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీపోనూ మిగిలిన ఆదాయ లోటును చార్జీల పెంపు ద్వారా డిస్కంలు భర్తీ చేసుకోనున్నాయి. దీంతోపాటు రెండేళ్లుగా చార్జీల పెంపు వాయిదా పడుతుండడంతో డిస్కం ఆదాయ లోటు రూ.15 నుంచి రూ.20 వేల కోట్లకు పెరిగింది.
విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనల నేపథ్యంలో 2021 జనవరి నెలలో మూడేళ్ల ఏఆర్ఆర్ నివేదికలను ఈఆర్సీలకు అందించాలని డిస్కంలు నిర్ణయించినట్టుగా సమాచారం. విద్యుత్ చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం నవంబర్ 30వ తేదీ లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల అంచనా నివేదిక (ఏఆర్ఆర్)ను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సి ఉంటుంది. 202122 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్ను జిహెచ్ఎంసి ఎన్నికల కారణంగా డిస్కంలు వాయిదా వేసుకున్నాయి. మూడేళ్ల ఏఆర్ఆర్ నివేదికలను ఈ నెలలో డిస్కంలు ఈ ఆర్సీలకు సమర్పించనున్నట్టుగా తెలిసింది.
టారిఫ్ పట్టికలో కొత్త కేటగిరీ సృష్టించి దోబీఘాట్లు, లాండ్రీలు, సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు డిస్కంలు ఈఆర్సీకి ప్రతిపాదించనున్నాయి.
1,32,194 పరిశ్రమలకు మేలు
అయితే మార్చి, ఏప్రిల్, మే నెల చార్జీలు మాత్రమే పక్కనపెట్టిన ఈఆర్సీ వాటిని తర్వాత చెల్లించడానికి అవకాశం ఇచ్చింది. చార్జీలు రద్దు చేసే అధికారం లేదంటూ వందలాది పిటిషన్లను తోసిపుచ్చింది. ఇప్పుడు ఆ చార్జీలను రద్దు చేస్తామని టిఆర్ఎస్ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఈనెల లేదా జనవరి 2021లో వెలువడే అవకాశం ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల 1,32,194 పరిశ్రమలకు మేలు జరుగనుంది.
సెలూన్లు, దోబీఘాట్లకు లబ్ధి
సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లకు ఈనెల నుంచి ఉచితంగా విద్యుత్ అందించనున్నట్లు సిఎం ప్రకటించిన నేపథ్యంలో 70 వేల సెలూన్లకు రూ.90 నుంచి 110 కోట్ల ప్రయోజనం చేకూరనుంది. ఇక ధోబీఘాట్లు/లాండ్రీలు కలుపుకొని 1.50 లక్షల దాకాఉంటా యి. వాటికీ రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల దాకా లబ్ధి రజకులకు కలగనుంది. కాగా ఎస్సీ, ఎస్టీల్లో 101 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ను వినియోగించే వారిసంఖ్య 3,16,963. తాజా నిర్ణయంతో మరో 2.5లక్షల మందికి ఉచిత విద్యుత్ అందనుంది. సెలూన్లు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్తో రూ.200 కోట్ల మేర అదనంగా ప్రభుత్వం భరించనుంది.