భారత్ బయోటెక్ అధినేత్రి సుచిత్ర ఎల్లా
న్యూఢిల్లీ : తమ తయారీ అయిన కొవాగ్జిన్ శాస్త్రీయ ప్రామాణికతల సంపూర్ణత్వాన్ని సంతరించుకుందని భారత్ బయోటెక్ సంస్థ తెలియచేసుకుంది. శనివారం సంస్థ సహ వ్యవస్థాపకులు, సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ఓ ట్వీటు వెలువరించి తమ వ్యాక్సిన్ పారదర్శకత తిరుగులేనిదని తేల్చిచెప్పారు. పూర్తిగా దేశీయం, శాస్త్రీయ ప్రామాణికతల విషయంలో కట్టుబడి ఉన్నామని తెలియచేసుకుంటున్నట్లు వివరించారు. కొవాగ్జిన్ భద్రతా సమర్థత గురించి ఇప్పటివరకూ జరిగిన తొమ్మిది అధ్యయనాల వివరాలను కంపెనీ ప్రచురించిందని, నిజాలను ప్రజల ముందుకు తెచ్చిందని ట్వీట్లో తెలిపారు. కొవాగ్జిన్ శాస్త్రీయ ప్రామాణికత, పారదర్శకత పట్ల అంకితభావం సంతరించుకుని ఉంది. అకాడమిక్ జర్నల్స్, నిపుణుల విశ్లేషణలు, ఎన్ఐవి ఐసిఎంఆర్, బిబి పరిశోధకులు, సైంటిస్టులు వెలువరించిన అభిప్రాయాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయని, పలు అధ్యయనాలు, గణాంకాలతో సహా నివేదించడం జరిగిందని వివరించారు.
తమ వ్యాక్సిన్కు సంబంధించిన ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ పాక్షిక డాటాను భారతదేశంలోని ఔషధ అధీకృత సంస్థలు తగు విధంగా ధృవీకరించాయి. ఈ విషయాన్ని మరోసారి అందరితో ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నామని సుచిత్ర తెలిపారు. అన్ని ట్రయల్స్ను నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించి, పర్యవేక్షించారని, పారదర్శకతనే తమకు ప్రామాణికం అని, సరైన ప్రమాణాల దిశలోనే వ్యాక్సిన్ తయారీ జరిగిందని స్పష్టం చేశారు. తరచూ తలెత్తుతున్న వేరియంట్ల సంబంధిత సమాచారం అంతా సిద్ధం చేసుకుని తగు విధంగా స్పందించిన ఉత్పత్తిని రూపొందించామని, ఈ విధంగా తమ వ్యాక్సిన్కు ప్రత్యేకత దండిగా ఉందని తెలిపారు. భారత్ బయోటెక్ తమ వ్యాక్సిన్ తయారీకి సంబంధించి మూడు కీలక ప్రీక్లినికల్ స్టడీస్ పూర్తి చేసుకుందని, దేశంలో వివిధ స్థాయి జనాభాపై పరీక్షల దశలో సమర్థతను చాటుకుందని వెల్లడించారు.