Friday, April 26, 2024

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం: రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బడుగు, బలహీన వర్గాలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో గురువారం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖ్, పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి, పిసిసి తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలుగా ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని వ్యాఖ్యానించారు.

వెట్టిచాకిరి నిర్మూలనకు ఆ నాడు కాంగ్రెస్ హయాంలో పేదలకు పంపిణీ చేసిన భూములను నేడు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. 10వేల ఎకరాల కాంగ్రెస్ హయాంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు పంపిణీ చేశామని తెలిపారు. ఇప్పడున్న ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. పేదల భూములను గుంజుకొని బడా కంపెనీలకు ధారాదత్తం చేసిందని ధ్వజమెత్తారు. పేదలకు పంపిణీ చేసిన 20వేల ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకొని లేవట్లు వేసి ప్లాట్లుగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆ రోజుల్లోనే తనభూమిని కాపాడుకోవాడనికి నైజాం ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఎదురుతిరిగిందన్నారు. ఐలమ్మ స్పూర్తిగా తీసుకొని భూమిని కాపాడుకోవడానికి పోరాడాలని పిలుపునిచ్చారు.

నాలుగు నెలల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రానుందని, ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి పేదలకు పంచుతామని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఉదండాపూర్ రిజర్వాయర్ విషయంలో బాధితులకు నష్టపరిహారంలో న్యాయం జరగలేదని విమర్శించారు. 2013 యాక్ట్ ప్రకారం బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాలమూరులో జూరాల, నెట్టెంపాడు, కల్వకుర్తి, శ్రీశైలం, నాగార్జున సాగర్ కూడా మేమే కట్టామని, రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా మేమే పూర్తి చేస్తామన్నారు. పేదలకు రూ. 5 లక్షల రూపాయలతో ఇళ్ల నిర్మాణాలకు సహాయం అందిస్తామన్నారు. బియ్యంతో పాటు నిత్యావవసర సరుకులు 9 రకాల సరుకులు పంపిణీ చేస్తామన్నారు.

1200 గ్యాస్ సిలిండర్‌ణు రూ.500కే ఇస్తామన్నారు. ఉచిత విద్య, ఫీజు రియంబర్స్‌మెంట్, రెండు లక్షల ఉద్యోగ భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు రూ. 4000 వేలు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. వడ్డీలేని రుణాలను డ్వాక్రా సంఘాలకు అందజేస్తామన్నారు. రైతులకు రెండు లక్షలు ఒకే సారి రుణ మాఫీ చేస్తామని భట్టి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి కార్యదర్శి బోసు రాజు, సీనియర్ నేత మల్లురవి, సంపత్‌కుమార్, ఎంపిలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిహెచ్ హనుమంతురావు, డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, పిసిసి నేతలు అనిరుధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News