అమరావతి: రెండు రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయిన వృద్ధురాలు కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఆ వృద్ధురాలు అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులకు గుండెల్లో భయం పట్టుకుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా గాంధీనగర్లో జరిగింది. ఎప్రిల్ 11న వృద్ధురాలుకు గుండెపోటు రావడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు 75 సంవత్సరాలు ఉండడంతో గుండె జబ్బుకు వైద్యులు చికిత్స చేశారు. ఆస్పత్రి చేరిన రెండు రోజుల తరువాత ఆమె చనిపోయింది. వైద్యులు ఎందుకైనా మంచిదని ఆమె కరోనా టెస్టు చేసి ల్యాబ్ పంపించారు. రెండు రోజుల తరువాత ఆమె కరోనా సోకిందని రిపోర్ట్ వచ్చింది. దీంతో వృద్ధురాలు అంత్యక్రియలలో పాల్గొన్న బంధువులు, స్థానికులు భయంతో వణికిపోతున్నారు. వెంటనే పోలీసులు, వైద్యులు ఆమె అంత్యక్రియలకు హాజరైన వారిని హోమ్ క్వారంటైన్లో ఉండాలని హెచ్చరించారు.