Sunday, May 12, 2024

ధరణి పోర్టల్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న కరెక్షన్ మాడ్యూల్

- Advertisement -
- Advertisement -

పరిష్కారం కానున్న డేటా ట్రాన్స్‌ఫర్ సమస్యలు
కరెక్షన్ మాడ్యూల్స్ యాక్సెస్‌పై త్వరలో నిర్ణయం
టెక్నికల్ ఎర్రర్స్ తొలగితే పెరగనున్న లావాదేవీలు

Rythu Bandhu distribution from June 15 in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్:  ధరణి పోర్టల్లో త్వరలో కరెక్షన్ మాడ్యూల్ అందుబాటులోకి రానుంది. ఆ దిశగా రెవెన్యూశాఖ చేసిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. ఈ మాడ్యూల్ యాక్సెస్‌ను కలెక్టర్లకు ఇవ్వాలా లేక జిల్లాస్థాయిలో, రాష్ట్రస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ఆ బాధ్యత వారికి అప్పగించాలా అనే అంశంపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. ఈ విషయంలో అవినీతికి ఆస్కారం లేని విధానాన్ని అవలంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కరెక్షన్ మాడ్యూల్ అందుబాటులోకి వస్తే డేటా ట్రాన్స్‌ఫర్ వల్ల భూయజమానులు, హక్కుదారుల పేర్లలో, సర్వే నంబర్లలో, భూవిస్తీర్ణంలో తలెత్తిన తప్పులు, కంప్యూటర్ రికార్డుల్లోని ఇతర అచ్చుతప్పులను సవరించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. తద్వారా పోర్టల్‌లోని అసౌకర్యం తొలగిపోయి క్రయ, విక్రయాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
మంత్రివర్గ ఉపసంఘం కొన్ని సిఫారసులు
సులభంగా, సరళమైన పద్ధతిలో, పారదర్శకంగా, అధికారులకు ఎలాంటి విచక్షణాధికారాలకు తావు లేకుండా భూముల క్రయ,విక్రయాలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ ను తీసుకొచ్చింది. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సరళతరం కావడంతో పాటు భూ లావాదేవీల్లో అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండాపోయింది. అయితే, సమగ్ర ప్రక్షాళన తరువాత వివిధ రకాల భూరికార్డులను ఐటి శాఖ ధరణి పోర్టల్లోకి బదలాయించింది. ఈ క్రమంలో కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ తలెత్తాయి. ఇలాంటి సమస్యల అధ్యయనం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం వాటి పరిష్కారం కోసం కొన్ని సిఫారసులు చేసింది. పోర్టల్‌లో అదనంగా మరో ఏడు నుంచి ఎనిమిది మాడ్యూల్స్ తీసుకురావాలని సూచించింది. ఆమేరకు ప్రవేశపెట్టిన కొత్త మాడ్యూల్స్‌తో కొన్ని ఇబ్బందులు తొలగిపోయాయి.
తొలగని అచ్చుతప్పులు
కానీ, భూ యజమానులు, హక్కుదార్ల పేర్లు, సర్వే నంబర్లు, భూవిస్తీర్ణం తదితర అంశాల్లో చోటు చేసుకున్న అచ్చుతప్పులు మాత్రం ఇంకా తొలగిపోలేదు. అలాంటి భూముల క్రయ,విక్రయాలు కూడా తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు, ఫిర్యాదులు అందాయి. అన్ని కోణాల్లో దృష్టిసారించిన ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం కోసం ధరణిలో కరెక్షన్ మాడ్యూల్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. త్వరలో దీనిపై కూలంకషంగా చర్చించి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదంతో ధరణి పోర్టల్లో ప్రభుత్వం కరెక్షన్ మాడ్యూల్ ను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిషేధిత జాబితాలోకి వెళ్లిన 3 లక్షల ఎకరాల భూములను సైతం ప్రభుత్వం కలెక్టర్లకు అధికారాలిచ్చి ఆ జాబితా నుంచి ఈ మధ్యనే వాటిని తొలగించింది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రవేశపెట్టనున్న కరెక్షన్ మాడ్యూల్ తో ధరణి పోర్టల్లో సమస్యలు దాదాపుగా సమసిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News