Friday, April 26, 2024

ఆర్టిసి బస్సు ఢీకొని దంపతుల మృతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో దంపతులు మృతిచెందిన సంఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ టౌన్‌ను చెందిన తునికి తులసీదాస్(65), తునికి రాజమణి(62) భార్యాభర్తలు. వీరి కుమారుడు తునికి రామరాజు గచ్చిబౌలిలో ఉంటూ ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కొత్త ఏడాది రోజులన దంపతులు ఇద్దరు తన కుమారుడిని చూసేందుకు నగరానికి వచ్చారు. ఉదయం నిర్మల్ నుంచి బయలుదేరిన దంపతులు మధ్యాహ్నం 2.15 గంటలకు బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ చౌరస్తా వద్ద బస్సు దిగారు. అక్కడి నుంచి గచ్చిబౌలిలోని కుమారుడి వద్దకు వెళ్లేందుకు పఠాన్ చెరువు బస్సు ఎక్కడానికి తులసీదాస్, రాజమణి బాలానగర్ వైపునకు వెళ్లే బస్టాప్‌కు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నారు.

అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా దూసుకు వచ్చిన ఎపి 29జెడ్ 2608 జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు రోడ్డు దాటుతున్న తులసీదాస్, రాజమణి దంపతులను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే స్థానికులు ఆర్‌టిసి బస్సును ఆపి డ్రైవర్ నరహరిని పోలీసులకు అప్పగించారు. దంపతుల వద్ద ఉన్న ఫోన్‌లో చివరి కాల్ వారి కుమారుడు రామరాజుకు చెయడంతో అతడికి ఫోన్ చేసి పోలీసులు విషయం చెప్పారు. తల్లిదండ్రుల మృతదేహాలను చూసిన రామరాజు ఒక్కసారిగా కుప్పకూలాడు, తనకు 10 నిమిషాల ముందే ఫోన్ చేశాడని బోరున విలపించాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని బోయిన్‌పల్లి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News