మొక్కలు నాటిన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ప్రారంభమైన గ్రీన్ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్తంగా ప్రముఖులను అమితంగా ఆకట్టుకుంటుంది. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ముందుకు దూసుకుపోతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఢిల్లీలోని సుందర్ నగర్లోని తన నివాసంలో క్రికెట్ దిగ్గజం, భారతదేశం మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ఇండియా ఛాలెంజ్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి మంచి వాతావరణం కావాలని ఆశిద్దాం అని చెప్పారు. భారతీయులంతా బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించడం మనందరి బాధ్యతని గుర్తు చేశారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు మంచి గుర్తింపు
ఐపిఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్
భువనగిరి జిల్లాకలెక్టర్ అనితా రామచంద్రన్ ఇచ్చిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్వీకరించి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సోసైటీ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మొక్కలు నాటారు. గ్రీన్ఇండియా ఛాలెంజ్ దేశాలు, ఖండాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంపి సంతోష్కుమార్ అభిమానులు, ప్రకృతి ప్రేమికులు మొక్కలు నాటుతున్నారని ప్రవీణ్కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా సిఎం సిపిఆర్ఒ జ్వాలా నరసింహారావు రాసిన కథనంలో హరితహారం ప్రాముఖ్యత, ఉదేశ్యం 24 శాతం నుంచి 33 శాతానికి పచ్చదనం పెంచడమనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత 6 సంవత్సరాల్లో 5.8 శాతం అభివృద్ధి చెంది 29 శాతానికి చేరుకోవడం హరితహారం విజయంగా ఆయన చెప్పారు. హరితహారానికి మద్దతుగా ఎంపి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ ప్రముఖులను భాగస్వామ్యం చేస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తుంది. 267 రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులను భాగస్వామ్యం చేసి వారి ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.