Monday, April 29, 2024

నాడు సంక్షోభం.. నేడు సంక్షేమం

- Advertisement -
- Advertisement -

ఆర్మూర్ : సమైక్య పాలకులు పాపిష్టి పాలనలో నాడు సంక్షోభం చవిచూసిన తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన వల్ల నేడు సంక్షేమం వెల్లివిరుస్తోందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాలులో శుక్రవారం సంక్షేమ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆర్మూర్ నియోజక వర్గంలో పండగ వాతావరణం నెలకొంది. ఈకార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఇంట్లో సంక్షేమం.. ప్రతీ కంట్లో సంతోషం కనిపించడానికి కర్మ, కర్త, క్రియ కెసిఆర్ అని అభివర్ణించారు.

నేడు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగని పల్లె ఉందా? సంక్షేమ అందని ఇల్లుందా? అని ఆయన ప్రశ్నించారు. ఇది కెసిఆర్ కలం రాసిన సంక్షేమ గేయం నాడు సీమాంద్ర పాలకులు చేసిన గాయాలు నేడు మానిపోయాయి. కెసిఆర్ అంటే కరేజ్.. ఒక ఇమేజ్ కెసిఆర్ అంటే ఉమ్మడి పాలకులు ధ్వంసం చేసిన తెలంగాణను రిపేర్ చేస్తున్న జనతా గ్యారేజ్ కెసిఆర్ అంటే సాగు, తాగు నీరిచ్చే బ్యారేజ్ కెసిఆర్ అంటే పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు చేసే మ్యారేజ్ అదే కాంగ్రెస్, బిజెపిలు దేశానికి డ్యామేజ్. ఈ రెండుపార్టీలు కుళ్ళి కంపుకొట్టే డ్రైనేజీ అని జీవన రెడ్డి తనదైన శైలిలో సభను ఉర్రూతులూగించారు. ఏరాజ్యంలో స్త్రీలు సుఖ సంతోషాలతో ఉంటారో ఆ రాజ్యం సుభిక్షంగాక ఉంటుందని చాణుక్యుడి రాజనీతి శాస్త్రంలో పేర్కొన్న విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో మహిళల కంట కన్నీరొలకకుండా పాలన సాగిస్తున్నారు. వీరితో పాటు 20 లక్షల మంది పిల్లలు కూడా ప్రతి రోజు భోజనం తింటున్నారు. ఆర్మూర్ నియోజక వర్గ వ్యాప్తంగా 25 వేల మందికి పైగా అనారోగ్య బాధితులకు సిఎంఆర్‌ఎఫ్ సాయం మరో 5 వేల మంది అనారోగ్య బాధితులకు ఎల్‌వోసిలు అందించామని జీవన్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ మోడల్ నచ్చింది కాబట్టే మహరాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. కెసిఆర్ అంటే ఒక నమ్మకం. మోడీ అంటే ఒక అమ్మకం. అవినీతికి కాంగ్రెస్ కిటికీలు తెరిస్తే బిజెపి దర్వాజాలు బార్ల తెరిసింది. ఎక్కడికెళ్లినా సబ్బండ వర్గాలు సారు, కారు కెసిఆర్ వైపే ముచ్చటగా మూడోసారి నేనే గెలుస్తా అని జీవన్ రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో జడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పండిత్ వినిత పవన్, సీనియర్ నాయకులు డాక్టర్ మధుశేఖర్, పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్, నియోజక వర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News