Saturday, April 27, 2024

జూన్ 20 నుంచి డిగ్రీ, పిజి ఫైనల్ ఇయర్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

Degree and PG Final Year Exams from June 20

 

మిగతా విద్యార్థులకు ముందుగా ప్రమోట్
కళాశాలల ప్రారంభం తర్వాత పరీక్షల నిర్వహణ
పరీక్షా సమయం 2 గంటలకు కుదింపు, ఆన్‌లైన్‌లో వైవా వాయిస్, సెమినార్లు
మార్గదర్శకాలు జారీ చేసిన ఉన్నత విద్యామండలి

మనతెలంగాణ/హైదరాబాద్ : డిగ్రీ, పిజి పరీక్షల్లో ముందుగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి సెమిస్టర్ పరీక్షలతో పాటు బ్యాక్‌లాగ్ పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో విద్యాసంవత్సరం ప్రారంభం, పరీక్షల నిర్వహణలో సవాళ్లు, సమస్యలపై అధ్యయనం చేసేందుకు యుజిసి నిపుణులతో కమిటీని నియమించింది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన యుజిసి కమిటీ సిఫార్సులకు అనుగుణంగా వర్సిటీలకు మార్గదర్శకాలు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో యుజిసి మార్గదర్శకాలకు అనుగుణంగా డిగ్రీ, పిజి పరీక్షల స్పష్టతనిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. డిగ్రీ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు తర్వాత కోర్సులు చేయాలన్నా, ఉద్యోగాలకు వెళ్లాలన్నా పరీక్షలు పూర్తి చేసి ధృవపత్రాలు పొందాల్సి ఉంటుంది, కాబట్టి వారికి ముందుగా పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. కోవిడ్-19కు సంబంధించిన జాగ్రత్తలను, ప్రొటోకాల్‌ను పాటిస్తూ జూన్ 20 నుంచి డిగ్రీ, పిజి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. పరీక్షలు, ఇతర అంశాలలో ఇచ్చిన సడలిపుంలు కేవలం 2019- 20 విద్యాసంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి స్పష్టం చేశారు.

ఈ సారి నో డిటెన్షన్

కళాశాలలు ప్రారంభమైన తర్వాత ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో మిగతా సెమిస్టర్ల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వర్సిటీలకు జారీ చేసిన మార్గదర్శకాలలో పేర్కొంది. మిగిలిన సెమిస్టర్ల విద్యార్థులను ముందుగా పై సెమిస్టర్ల ప్రమోట్ చేసి, తర్వాత పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. గతంలో 50 శాతం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే తర్వాతి సెమిస్టర్‌కు ప్రమోట్ చేసేవారు. ఆ మేరకు ఉత్తీర్ణత సాధించనివారిని డిటెన్షన్ చేసేవారు. ప్రస్తుతం బ్యాక్‌లాగ్ సబ్జెక్టులతో సంబంధం లేకుండా అందరినీ తర్వాతి సెమిస్టర్‌కు ప్రమోట్ చేయాలని ఆదేశించింది. ఉదాహరణకు రెండవ సెమిస్టర్ విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే మూడవ సెమిస్టర్‌కు ప్రమోట్ చేస్తారు. ఆ తర్వాత రెండవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తారు. బ్యాక్‌లాగ్‌లు ఉంటే పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. డిటెన్షన్ మాత్రం చేయరు.

పరీక్షల సమయం 2 గంటలే

కరోనా నేపథ్యంలో డిగ్రీ, పిజి పరీక్షల సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు కుదించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వర్సిటీలకు సూచించింది. మొత్తం సిలబస్ నుంచి విద్యార్థులకు ఎక్కువ ఛాయిస్ ఇస్తూ రెండు గంటల్లో పరీక్ష పూర్తి చేసే ప్రశ్నపత్రం రూపొందించాలని తెలిపింది. విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు కల్పించేలా ప్రశ్నపత్రం రూపొందించాలని, వర్సిటీలు తమ పరిస్థితులకు అనుగుణంగా ప్రశ్నపత్రం రూపకల్పనపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

షిఫ్టుల వారీగా పరీక్షల నిర్వహణ

పరీక్షల నిర్వహణలో భౌతిక దూరం కచ్చితంగా పాటించాల్సిన ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో యుజిసి మార్గదర్శకాలకు అనుగుణంగా రోజుకు రెండు సెషన్లవారీగా షిఫ్టు విధానంలో పరీక్షలు నిర్వహించాలనిరాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. ఉదయం షిఫ్టులో బి.కాం పరీక్షలు, మధ్యాహ్నం షిఫ్టులో బిఎ,బిఎస్‌సి పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. ఈ కోర్సులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షల విషయంలో సంబంధిత కళాశాలలే బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్లను నియమించుకునే వెసులుబాటు కల్పించాలని తెలిపింది.

ఆన్‌లైన్‌లో వైవా వాయిస్

పరిశోధన విద్యార్థులకు సంబంధించిన ప్రాజెక్టు వైవా వాయిస్, సెమినార్లను ఆన్‌లైన్‌లో నిర్వహించుకోవచ్చని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. యుజిసి మార్గదర్శకాలు పాటిస్తూ సంబంధిత అధ్యాపకులు, ఆయా విభాగాలకు చెందిన నిపుణులు సమక్షంలో ఆన్‌లైన్‌లో వైవా వాయిస్ నిర్వహించాలని తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News