Monday, April 29, 2024

డిగ్రీ కోర్సులకు పెరుగుతున్న ఆదరణ

- Advertisement -
- Advertisement -

 పెరుగుతున్న అవకాశాలు…ఆసక్తి కనబరుస్తున్న విద్యార్థులు

Degree classes to start from Sep 1 in Telangana
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. బిఎస్‌సి, బికాం కోర్సులు చదివితే ఉపాధి అవకాశాలు లభిస్తుండటంతో విద్యార్థులు వీటిలో ప్రవేశాలు పొందేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. డిగ్రీ విద్యార్థులకు కూడా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు చదివిన వారికి సమానమైన ప్యాకేజీలు లభించకపోవడంతో విద్యార్థులు డిగ్రీ కోర్సులవైపు మొగ్గు చూపుతున్నారు. కోర్సు పూర్తయిన తర్వాత డిగ్రీతో ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే ఎంబిఎ, ఎంసిఎ, బి.ఇడి, ఎంఎస్‌సి,ఎంకాం, ఎంఎ వంటి కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ప్రస్తుతం డిగ్రీలో బిఎస్‌సి కంప్యూటర్ సైన్స్, బిఎస్‌సి కెమిస్ట్రీ, బికాం కంప్యూటర్స్ విభాగాల్లో విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. 2016- 17 విద్యాసంవత్సరంలో తొలిసారిగా డిగ్రీలో ఆన్‌లైన్ ప్రవేశాలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 4.20 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా, 2.20 లక్షల సీట్లు భర్తీ అయ్యాయి. ఈ విద్యాసంవత్సరం రాష్ట్రంలోని 905 డిగ్రీ కాలేజీల్లో 4,08,345 అందుబాటులో ఉండగా, దోస్త్ తొలి విడతలోనే 1,67,130 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ప్రస్తుతం రెండవ విడత దోస్త్ కౌన్సెలింగ్ కొనసాగుతుండగా, ఈసారి కూడా దాదాపు 2.50 లక్షల వరకు డిగ్రీ సీట్లు భర్తీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డిగ్రీతో లభిస్తున్న అవకాశాలు

డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు క్యాంపస్ నియామకాలలోనే ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఇంజనీరింగ్ అభ్యర్థులతో సమానంగా హోదా, వేతనాలు లభిస్తున్నాయి. గతంలో ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కళాశాలలకే పరిమితమైన ప్రాంగణ నియామకాలు డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్నాయి. డిగ్రీ కళాశాలల్లో సైతం బడా కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ చేపడుతున్నాయి. సాధారణ డిగ్రీ పట్టభద్రులను ఎంపిక చేసుకుని సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నాయి. దాంతో విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకే మొగ్గు చూపుతున్నారు. బిఎస్‌సి చేసిన వారికి ఫార్మా కంపెనీలతోపాటు కార్పోరేట్ కంపెనీలలో ట్రైయినీ అసోసియేట్స్‌గా, బిపిఒలుగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. దాంతోపాటు బ్యాంకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు వెలువడే నోటిఫికేషన్లలో ఉద్యోగాలు పొందుతున్నారు. బి.కాం చేసిన వారికి అకౌంటింగ్,ఆడిటింగ్, బ్యాంకింగ్ రంగాలలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. బిఎ చేసిన వారు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న నూతన ఆర్థిక విధానాలతో కామర్స్ అభ్యర్థులు డిమాండ్ పెరుగుతోంది.

వృత్తి విద్యాకోర్సులపై తగ్గుతున్న ఆసక్తి

వృత్తి విద్యా కోర్సులపై క్రమంగా ఆసక్తి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ అర్హతతో ప్రవేశాలు పొందే ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి వృత్తి విద్యాకోర్సుల్లో సీట్లు మిగలడమే అందుకు అద్దం పడుతోంది. డిమాండ్ ఉన్న కొన్ని కోర్సులు మినహా మిగతా కళాశాలల్లో ఏటా సీట్లు మిగుతులున్నాయి. ఒకప్పుడు సాధారణ డిగ్రీ అంటే చులకన భావం ఉండేది. కానీ ఇప్పుడు డిగ్రీ చేయడానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంజనీరింగ్,ఫార్మసీ వంటి కోర్సులు నాలుగేళ్లపాటు ఎంతో ఖర్చు చేసి సీరియస్‌గా చదవాల్సి ఉంటుంది. సాధారణ డిగ్రీ అయితే ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు మూడేళ్లలో కోర్సు పూర్తవుతుంది. కోర్సు చేస్తున్న సమయంలో కూడా పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతో పేద,దిగువ మధ్యతరగతికి చెందిన విద్యార్థులు డిగ్రీలో చేరేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్రంలో ఏటా 4.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్మీడియేట్ పూర్తి చేస్తుండగా, అందులో అత్యధికంగా దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు డిగ్రీలోనే చేరుతున్నారు. మిగతా విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో చేరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News