న్యూఢిల్లీ: నిర్భయ దోషులు నలుగురిని ఉరితీసేందుకు ఢిల్లీ సెషన్స్ కోర్టు తాజా డెత్ వారంట్లు వెలువరించింది. ఈ నెల 20వ తేదీ తెల్లవారుజాము 5.30 నిమిషాలకు వారి ఉరితేదీని ఖరారు చేస్తూ గురువారం అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా డెత్వారంట్లను పంపించారు. కేసుకు సంబంధించి దోషులు అంతా కూడా తమ ముందున్న చట్టపరమైన తుది మార్గాలను వినియోగించుకున్నారు. తిరస్కరణకు గురి అయ్యారు. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం సెషన్స్ కోర్టుకు తెలిపింది. దీనిని పరిగణనలోకి తీసుకుని డెత్వారంట్లను తాజాగా వెలువరిస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. పారా మెడికల్ ఉద్యోగిని నిర్భయపై అత్యాచారం , హత్య కేసులో ముఖేష్ కుమార్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్కుమార్ సింగ్ (31) దోషులుగా ఖరారు అయ్యారు.
ఇప్పుడు తాజా డెత్వారంట్లతో ఈ నెల 20న వీరికి ఉరిశిక్షలు అమలు కావల్సి ఉంది. ఉరిశిక్షల అమలుకు ఇప్పటికే తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. దోషులకు డెత్వారంట్లు జారీ చేయడానికి ఇప్పుడు ఎటువంటి చట్టపరమైన అవరోధాలు లేవని న్యాయస్థానానికి ఢిల్లీ ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలియచేశారు. పవన్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్ను బుధవారం రాష్ట్రపతి తోసిపుచ్చారు. వెంటనే ఉరి అమలుకు డెత్వారంట్లు వెలువరించాలని ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు అప్పీలు చేసుకుంది. దోషులకు పలుసార్లు ఉరిశిక్ష అమలు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటి డెత్వారంట్ల మేరకు వీరికి ఈ నెల 20వ తేదీన ఉరి బిగుస్తుందని భావిస్తున్నారు.
Delhi Court Verdict 4 Convicts to hang on March 20