Monday, May 6, 2024

వీరశైవ లింగాయత్ లను ఓబిసి కేంద్ర జాబితాలో కలపాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వీరశైవ లింగాయత్‌లను ఓబిసి జాబితాలో చేర్చాలని, బిసిల ప్రధాన డిమాండ్‌లను వెంటనే పరిష్కరించాలని బుధవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘మహా ధర్నా దీక్ష‘ కార్యక్రమం జరిగింది. వీరశైవ లింగాయత్‌ల రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పట్లోల్ల సంగమేశ్వర్, అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప, నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్‌ల సెంట్రల్ కమిటీ సభ్యులు కె. శివ అప్ప, ప్రధాన కార్యదర్శి శెట్టి శివ కుమార్, కోశాధికారి జి. దినేష్ పాటిల్, యువజన అధ్యక్షులు రాచప్ప, .జిహెచ్‌ఎంసి అధ్యక్షులు శివ శరణ్, యువజన ప్రధాన కార్యదర్శి పి. భరత్, తెలంగాణ రాష్ట్ర నలుూమూలల నుండి ఆయా జిల్లాల అధ్యక్షులు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహా దీక్షలో పాల్గొన్నారు.

జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్య సభ సభ్యులు అర్. కృష్ణయ్య, బిఆర్‌ఎస్ రాజ్య సభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, బిఆర్‌ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాజ్య సభ సభ్యులు మస్తాన్ రావు, వైఎస్‌ఆర్‌సిపి పార్టీ, డిఎంకె, రాజ్య సభ సభ్యులు విల్సన్, ముఖ్య అతిథులుగా పాల్గొని సంఘీభావం తెలిపారు. విశిష్ట అతిథులుగా జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు, వీరశైవ లింగాయత్ ముద్దు బిడ్డ సురేష్ షెట్కర్, కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్, బిఆర్‌ఎస్ మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, బిజెపి అధికార ప్రతినిధి డిఆర్ దినేష్ చటోపాద్యాయ, దీక్షలో పాల్గొని తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.

రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, ఇతర ఎంపిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వీరశైవ లింగాయత్ కులాన్ని 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు వెనుకబడిన తరగతులు బిసి గ్రూపులో సీరియల్ నెంబర్ 46 లో చేర్చడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీరసేవ లింగాయతులను కేంద్ర ఓబిసి జాబితాలో చేర్చాలని జాతీయ బిసి కమిషన్‌కు ప్రతిపాదన పంపిందని గుర్తు చేశారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఓబిసి జాబితాలో వీరశైవ లింగాయత్‌లను చేర్చలేదని తెలిపారు. దీంతో వీరశైవ లింగాయత్ విద్యార్థులు విద్యా, ఉద్యోగ, పభుత్వాల పథకాల పరంగా గత 14 సంవత్సరాలుగా ఎంతో నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 40 అసెంబ్లీ సీట్లలో 8 పార్లమెంటు స్థానాలలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న లింగాయత్‌ల ఓట్లను మాత్రమే వాడుకుంటున్నారు తప్ప వారిని ఓబిసి జాబితాలో చేర్చడం లేదని పేర్కొన్నారు.

దాదాపు 40 లక్షల జనాభా ఉన్న వీరశైవ లింగాయత్‌లలో 90 శాతం మంది చాలా బీద పరిస్థితుల్లో ఉన్నారని వెంటనే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వీరశైవ లింగాయత్ లను కేంద్ర ఓబిసి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిసి బిల్లు పెట్టి బిసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బిసి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, బిసిల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని ఈ సందర్భంగా కృష్ణయ్య కోరారు. కేంద్ర ప్రభుత్వం ఓబిసిలకు బడ్జెట్‌లో రెండు లక్షల కోట్లు కేటాయించాలని, తెలంగాణ, ఎపి రాష్టాల మాదిరిగా బిసిల కోసం దేశ వ్యాప్తంగా స్కాలర్‌షిప్, ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాలను అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలన్నింటిని పార్లమెంటులో లేవనెత్తి పరిష్కారానికి ప్రభుత్వంపై ఎత్తిడి తేనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News