Saturday, April 27, 2024

స్పోర్ట్స్ విలేజ్ రూపకల్పనకు ప్రస్తుతం సియోల్‌లో అధ్యయనం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుండి దేశానికి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో త్వరలో స్పోర్ట్స్ పాలసీని అమలు చేయబోతున్నామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. అంతే కాకుండా సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు స్పోర్ట్స్ విలేజ్ రూపకల్పనపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్‌లతో కలిసి మంగళవారం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో 1988 ఒలంపిక్స్ క్రీడల సందర్భంగా నిర్మించిన క్రీడా మైదానాలను క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు.

భవిష్యత్తు లో ఒలంపిక్స్, ఏషియన్ గేమ్స్ లాంటి అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించేందుకు మన దేశానికి అవకాశం వస్తే వాటిని నిర్వహించే సత్తా తెలంగాణ రాష్ట్రానికే ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దిశగా భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి క్రీడల నిర్వహణకు క్రీడా మైదానాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఆ దిశగా క్రీడ మైదానాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా మైదానాలు నిర్మిస్తున్నామని, రాష్ట్రం నుండి దేశానికి ఎక్కువ మంది అంతర్జాతీయ క్రీడాకారులను అందించడమే లక్ష్యమన్నారు.

దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడారంగంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దామని, ప్రపంచ దేశాలతో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే క్రీడలలో పోటి పడబోతుందన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 17 వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మించామన్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లాంటి పట్టణాలలో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాల పరిశీలన
మన రాష్ట్రంలోనూ అంతర్జాతీయ స్థాయిలో క్రీడలను నిర్వహించడానికి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ముందస్తుగా క్రీడా మైదానాలను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగల కమలాకర్ , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తదితరులు పరిశీలించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉందని, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే సిఎం కప్ 2023 క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్ పేరుతో షామీర్‌పేట్ లో 230 ఎకరాల భూమి లీజుకు తీసుకున్న ఆ భూములను లీజుల నిబంధనలు పాటించకుండా ఉన్నా సంస్థపై సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు న్యాయ పోరాటం చేసి లీజును రద్దు చేసి తిరిగి స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా ఇప్పటికే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడ మైదానాలను నిర్మించామన్నారు. అలాగే గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 17వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో నిర్మించే క్రీడా మైదానాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తామన్నారు. క్రీడా పతకాలు సాధించడంలో ఇతర దేశాలతో తెలంగాణ పోటీ పడుతోందన్నారు. ఈ పర్యటనలో తెలంగాణ పర్యాటక శాఖ ఎండి మనోహర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News