Friday, May 3, 2024

ఎస్‌పి-ఆర్‌ఎల్‌డి స్థానాలు పెరిగినా బిజెపిదే అఖండ విజయం

- Advertisement -
- Advertisement -

Despite increase in SP-RLD seats, BJP has won landslide victory

పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల చిత్రం

నొయిడా : పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి), దాని మిత్ర పక్షం రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డి)గత ఎన్నికలు కన్నా ఈసారి ఎన్నికల్లో ఫలితాలను బాగా సాధించుకున్నప్పటికీ, బిజెపి ఈ రీజియన్‌లో 15 స్థానాలను కోల్పోయినా, దాదాపు 70 శాతం నియోజక వర్గాల్లో రాజ్యమేలింది. ఆగ్రా, మధుర, ఘజియాబాద్, గౌతమ్‌బుధ్ నగర్ వంటి జిల్లాలను బిజెపి పూర్తిగా తుడిచిపెట్టగలిగినా, విపక్షమిత్ర పక్షం కూడా షామ్లీ, మొరాదాబాద్‌ల్లో నూటికి నూరు ఫలితాలను సాధించడమే కాకుండాముజఫర్‌నగర్, మీరట్‌ల్లో మంచి ఫలితాలను రాబట్టగలిగింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని మొత్తం 403 స్థానాల్లో 300 స్థానాలను కైవసం చేసుకోగలిగిన బిజెపి ఈ ఎన్నికల్లో 255 స్థానాల్లో విజయం సాధించింది. సమాజ్‌వాదీ పార్టీ, తన మిత్ర పక్షాలతో కలిసి 125 స్థానాల్లో గెలుపొందిందంటే గత ఎన్నికల కన్నా రెట్టింపు సాధించినట్టు చెప్పవచ్చు. 2017లో పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని 24 జిల్లాల్లో 126 స్థానాలకు బిజిపి 100 స్థానాలను గెలుపొందగా, ఇప్పుడు 85 స్థానాలనే (67 శాతం) పొందగలిగింది.

సమాజ్‌వాది పార్టీ, ఆర్‌ఎల్‌డి కలిసి ఈ రీజియన్‌లోని మొత్తం 126 స్థానాలకు 41 స్థానాలనే (32 శాతం) ఆనాడు దక్కించుకోగా, జయంత్ చౌదరి నేతృత్వం లోని ఆర్‌ఎల్‌డి 2017 లో ఒకేఒక్క స్థానానికి పరిమితమై పోయింది. ఈసారి 33 స్థానాలకు పోటీ చేసి 8 స్థానాలను దక్కించుకోగలిగింది. బిజెపి షామ్లీ జిల్లా లోని ప్రస్తుత మంత్రి ప్రాతినిధ్యం వహించిన థానా భవన్ తోసహా మూడు సీట్లను కోల్పోయింది. మీరట్ లోని ఏడు స్థానాల్లో నాలుగు, ముజఫర్‌నగర్ లోని ఆరు స్థానాలకు నాలుగు, జాట్ ఆధిపత్యం కలిగిన మొత్తం మూడు స్థానాలను బిజెపి కోల్పోయింది. మొరాదాబాద్ లోని మొత్తం ఆరు స్థానాలూ , రాంపూర్, శంభల్ జిల్లాల్లో నాలుగు స్థానాల్లో మూడు కోల్పోయింది. ఘజియాబాద్ నుంచి ఒక మంత్రి ప్రత్యర్థిపై లక్ష ఓట్లుతో గెలుపొందినప్పటికీ మరో మంత్రి ఓటమి చెందారు. జాట్ జనాభా గణనీయంగా కలిగిన ఆగ్రా, మధుర, అలీగఢ్ జిల్లాల్లో బిజెపి పూర్తిగా తుడిచిపెట్ట గలిగింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలి రైతుల ఆందోళన ప్రభావం బాగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ బులందషహర్, ఘజియాబాద్, గౌతమ్‌బుధ్‌నగర్ ప్రాంతాల్లో అలాంటి ప్రభావం ఉన్నట్టు కనిపించలేదని పరిశీలకులు చెబుతున్నారు. బహుజన్‌సమాజ్ పార్టీ, కాంగ్రెస్ ఇతర పార్టీలు కూడా ఈ రీజియన్‌లో ఒక్క స్థానమైనా సంపాదించుకోలేక పోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News