బెంగళూరు : మాజీ సిఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి సందర్భంగా లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కారు. కరోనా మహమ్మారి నివారణకు భౌతిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా చెప్పినా దేవెగౌడ కుటుంబ పట్టించుకోలేదు. పెళ్లికి పెద్ద ఎత్తున బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. బెంగళూరు రామ్నగర్ కేతగానహళ్లిలోని ఫాం హౌస్లో జరిగిన ఈ వివాహానికి దేవెగౌడ కుటుంబసభ్యులు, పెళ్లి కుమార్తె రేవతి తల్లిదండ్రులు హాజరయ్యారు. పెళ్లి కుమార్తె రేవతి కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కృష్ణప్ప మనవరాలు. సుమారు 400మంది ఈ వివాహ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. వీరంతా ఏమాత్రం భౌతిక దూరం పాటించకుండా గుమిగూడి పెళ్లిని తిలకరించారు.
వధువరులతో పాటు ఎవరూ కూడా ముఖానికి మాస్క్లు ధరించకపోవడం గమనార్హం. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ పెళ్లిపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. విచారణకు ఆదేశించినట్టు ఉప ముఖ్యమంత్రి అశ్వత్నారాయణ తెలిపారు. రామనగర డిప్యూటీ నుంచి నివేదిక కోరినట్టు చెప్పారు. కలెక్టర్, ఎస్పితో కూడా మాట్లాడానని చెప్పారు. వ్యవస్థను అపహాస్యం చేసేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఇందులో రెండో ఆలోచనకు తావులేదన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామికి నిబంధనలు పాటించాలన్న విచక్షణ లేకపోవడం దారుణమని విమర్శించారు. నిఖిల్ కుమార స్వామి, -రేవతిల పెళ్లిపై సోషల్ మీడియాలో నెటిజనులు మండిపడుతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ పెళ్లి తంతు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు.