హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం గవర్నర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని కొనియాడారు. అతి తక్కువ కాలంలోనే తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశించారు. రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబీమా, రైతుబంధు, పల్లెప్రగతి లాంటి అద్భుతమైన పథకాలతో తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందన్నారు. రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు అమలు చేస్తోందని, 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నారని, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చుకున్నారని, కొత్త మున్సిపాలిటీలు, మండలాలు ఏర్పాటు చేసుకున్నారని, కొత్త మున్సిపాలిటీ, పంచాయతీ చట్టాలను తీసుకొచ్చారని గవర్నర్ పేర్కొన్నారు.