మహేంద్ర సింగ్ ధోనీ
షార్జా: ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్ను రవీంద్ర జడేజాకు ఇవ్వడంపై ఇంటాబయట విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. గాయం వల్ల డ్వేన్ బ్రావో బరిలోకి దిగక పోవడం, అందుబాటులో జడేజా తప్ప మరో మార్గం కనిపించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదన్నాడు. జడేజా వంటి బౌలర్ను తక్కువ చేసి చూడలేమని, అయితే చివరి ఓవర్ అక్షర్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోవడంతో ఓటమి తప్పలేదని ధోనీ స్పష్టం చేశాడు. ఒక వేళ బ్రావో అందుబాటులో ఉంటే మాత్రం ఫలితం కచ్చితంగా తమకు అనుకూలంగా ఉండేదన్నాడు. చివరి ఓవర్లో 17 పరుగులు చేయడం ఏ జట్టుకైన అంత తేలిక కాదన్నాడు. కర్ణ్ శర్మతో పోల్చితే జడేజాకు అనుభవం ఎక్కువ ఉండడంతో అతనికే తుది ఓవర్ను అప్పగించాలని నిర్ణయించినట్టు వివరించాడు. ఇక ఈ మ్యాచ్లో పేలవమైన ఫీల్డింగ్ తమ ఓటమికి ప్రధాన కారణమని ధోనీ అభిప్రాయపడ్డాడు.