న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా చాలా సార్లు సహనాన్ని కోల్పోయే వాడని, ఈ విషయాన్ని తాను చాలా సార్లు గమనించానని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు. ఇటీవలే చాలా మంది క్రికెటర్లు ధోనీ కోపానికి సంబంధించి ఎన్నో ఉదాహరణాలు చెప్పారని, ఇందులో వాస్తవాలు ఉన్నాయన్నాడు. అందరూ అనుకున్నట్టు ధోనీ మిస్టర్ కూల్ కెప్టెన్ ఏమీ కాడని, అతను కూడా చాలా సార్లు సహనాన్ని కోల్పోయి సహచరులపై నోరు పారేసుకునే వాడన్నాడు.
ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్లలో తనతో పాటు చాలా మంది సీనియర్లు విఫలమైనప్పుడూ ధోనీ చాలా తీవ్రంగా స్పందించేవాడని, అతని నుంచి వచ్చే మాటలు తూటళ్ల పేలేవన్నాడు. ధోనీ అందరూ అనుకున్నట్టు సహనంతో వ్యవహరిస్తాడని భావించడం తగదన్నాడు. ఇతర కెప్టెన్ల మాదిరిగానే అతనికి కూడా కోపం ఎక్కువ అన్నాడు. చాలా సార్లు సీనియర్లపై కూడా దురుసుగా ప్రవర్తించేవాడన్నాడు. అయితే ఈ విషయాలు బయటకు చెప్పేందుకు అప్పట్లో ఎవరూ సాహసించే వారు కాదని గౌతం గంభీర్ పేర్కొన్నాడు.