న్యూఢిల్లీ : సరిహద్దులలో ప్రస్తుత ఉద్రిక్తత సడలింపునకు భారత్- చైనాలు దౌత్యస్థాయిలో యత్నిస్తున్నాయి. బుధవారం ఇరుపక్షాల మధ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీని గురించి చర్చ జరిగింది. ఎల్ఎసి వెంబడి లద్ధాఖ్ ప్రాంతంలో ఇటీవలి ఘర్షణ దరిమిలా ఉద్రిక్తత నెలకొంది. దీని నివారణకు తగు మార్గాలను ప్రస్తుతం ఇరుపక్షాలూ అన్వేషిస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. భారత విదేశాంగ మంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ, చైనా విదేశాంగ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ జింఘావో మధ్య చర్చలు ఖరారు అయినట్లు అధికారులు తెలిపారు. ఇంతకు ముందు కూడా ఇరుదేశాల మధ్య దౌత్యస్థాయిలో చర్చలు జరిగాయి. ఈస్టర్న్ లద్ధాఖ్లో ఘర్షణకు అవకాశం ఉండే ప్రాంతాలలో సైన్యం ఉపసంహరణకు ఇరు దేశాల సైనిక వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దీని తరువాత ఇప్పుడు ఇరు పక్షాల విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధుల మధ్య చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది.