హైదరాబాద్ : వర్షాలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేశాయి. భారీ వర్షం కారణంగానే హైదరాబాద్లో చాలాకాలనీల్లో బురద, వరద నీరు నిలిచింది. దీంతో పైపులైన్ల లీకేజీ, వరద నీటి కారణంగా సంపుల్లోకి, ట్యాంకుల్లోకి అపరిశుభ్రమైన నీరు చేరి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు యుద్ధప్రాతిపదికన ఇంటింటికీ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలు పంపిణీ చేయాలని క్షేత్రస్థాయిలో అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. మంత్రి ఆదేశాలకు మేరకు జలమండలి అధికారులు వెంటనే పంపిణీ ప్రారంభించారు. సంపులను, ట్యాంకులను ప్రభుత్వం సరఫరా చేసే బ్లీచింగ్ పౌడర్తో శుభ్రం పరుచుకోవాలని, సరఫరా చేసే తాగునీటిలో క్లోరిన్ మాత్రలు కలుపుకొని వాడుకోవాలని జలమండలి సూచించింది. ప్రజారోగ్య పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, హైదరాబాద్లో సాధ్యమైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్నిచర్యలు తీసుకుంటామని మంత్రి కెటిఆర్ తెలిపారు.