Saturday, April 27, 2024

కేంద్రం వల్లే ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను విక్రయించం

- Advertisement -
- Advertisement -

ఆర్‌టిసికి త్వరలోనే పూర్వ వైభవం తీసుకొస్తాం
ఆదాయాన్ని పెంచుకుంటాం..నష్టాలకు పూర్తి స్థాయిలో చెక్‌పెడతాం
బస్సు భవన్‌లో నూతన చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి

Don't sale State Govt Assets

 

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం విక్రయించదని టిఎస్‌ఆర్‌టిసి నూతన చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. ఆర్‌టిసికి చెందిన అన్ని స్థలాలను కాపాడుతామన్నారు. ఉన్న ఆదాయ వనరులతోనే సంస్థను పూర్తిగా గట్టిక్కించేందుకు కృషి చేస్తామన్నారు. సంస్థకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది, ప్రజల ఆదారణతో సంస్థకు తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు.

సోమవారం ఉదయం ఆర్‌టిసి క్రాస్ రోడ్డులోని బస్సు బవన్‌లో చైర్మన్‌గా బాజిరెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్‌టిసి సంస్థ ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో నమ్మకంతో తనకు ఈ పదవి అప్పగించారన్నారు. ఈ నేపథ్యంలో సంస్థ పురోభివృద్ధి కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఇటీవల ఎండిగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఐపిఎస్ అధికారి సజ్జనార్ కూడా తనకు తోడుగా ఉండడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

ప్రజా రవాణా రంగంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ఆర్‌టిసి ప్రస్తుతం ఎన్నో ఒడిదుడికులను ఎదుర్కొంటున్నదన్నారు. అయినప్పటికీ ప్రణాణికుల సేవే ముఖ్యంగా భావిస్తోందన్నారు. ఒకవైపు ముడి చముర ధరల పెరుగుదలసతో పాటు కరోనా మహమ్మారి కారణంగా సంస్థ ఒక రకంగా కుదులైందన్నారు. దీని కారణంగా కొన్ని రాష్ట్రంలో ఆర్‌టిసి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. కానీ తెలంగాణలో అటువంటి పరిస్థితి లేదన్నారు. కరోనా కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సిబ్బందికి పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించడం జరిగిందన్నారు. ఆ సమయంలో సంస్థకు ఏకంగా రూ. 2500 కోట్ల నష్టాన్ని చవిచూసిందని బాజిరెడ్డి తెలిపారు. దీంతో సంస్థ ఆదాయ, వ్యవయాల్లో పెద్దఎత్తున వ్యత్యాసం ఏర్పడిందన్నారు. కరోనా కాలం కంటే ముందు సంస్థకు ఒఆర్ ద్వారా రోజుకు రూ. 13 కోట్లు సమకూరగా, ప్రస్తుతం వస్తున్న ఆదాయం మాత్రం రూ.10 కోట్లు మాత్రమేనని అన్నారు. ఇదిలా ఉండగా సంస్థ భరిస్తున్న వ్యయం రూ. 18 కోట్లు ఉండడంతో పెద్దఎత్తున నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోందన్నారు. ఈ నష్టాన్ని అధిగమించేందుకు త్వరలోనే సంబంధిత అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

సంస్థను గట్టిక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో చేయూతనందిస్తోందన్నారు. ప్రస్తుత సంవత్సరం బడ్జెట్‌లో మొత్తం మూడు వేల కోట్లను కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా బాజిరెడ్డి గుర్తు చేశారు. ఇందులో రూ.1500 కోట్ల ప్రణాళిక కింద మరో రూ. 1500 కోట్లు ప్రణాళికేతర కింద నిధులను కేటాయించి ఆర్‌టిసికి సహకరిస్తోందని ఆయన వెల్లడించారు. ఈ నిధుల ద్వారా సంస్థ ఉద్యోగుల జీతాలను సకాలంలో చెల్లిస్తామన్నారు. ప్రస్తుత నెలలో జీతాలు ఇవ్వడంలో కొంత ఆలస్యమైనప్పటికీ ఇకపై అలా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చైర్మన్ బాజిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో సంస్థ ఆర్ధిక పరిపుష్టి కోసం తన శక్తవంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ప్రధానంగా ఆదాయ మార్గాలను అన్వేషించడం, ఖర్చులను తగ్గించుకునే అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆర్‌టిసిలోనే సురక్షిత ప్రయాణం

ఆర్‌టిసిలో ప్రయాణించడమే అత్యంత సురక్షితమైనదని బాజిరెడ్డి అన్నారు. సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లకు ఒక విధి, విధానాలు ఉంటాయన్నారు. నిబంధనల మేరకు విధులు నిర్వహిస్తారన్నారు. పైగా వారిపై సంబంధిత అధికారుల నుంచి నిరంతర నిఘా ఉంటుందన్నారు. దీంతో ఆర్‌టిసి డ్రైవర్లు తమ విధుల్లో నిర్లక్షం వహించే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయన్నారు. ఫలితంగా ప్రయాణికులు సాఫీగా తమ గమ్యస్థానం చేరుకునే అవకాశముంటుందన్నారు. కానీ ఇటీవల ప్రయాణికులు ఆర్‌టిసిని కాకుండా ఆటోల్లో ప్రయాణించి పెద్దఎత్తున ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. అందువల్ల ప్రయాణికులు కూడా ఆటోలో ప్రయాణించే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని బాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

బాజిరెడ్డికి అభినందలు తెలిపిన మంత్రులు, ప్రజాప్రతినిధులు
చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డికి పలువురు మంత్రులు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, ఇతర ప్రజాప్రతినిధులు, సంస్థకు చెందిన ఉన్నతాధికారులు కలిసి అభినందనలు తెలిపారు. వారిలో మంత్రులు మహమ్మూద్ అలీ, వేమూరి ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఎంపి సురేష్‌రెడ్డి, ఎంఎల్‌సిలు కల్వకుంట్ల కవిత, విజి గౌడ్, శాసనసభ్యులు జీవన్‌రెడ్డి, ముఠాగోపాల్, గణేష్‌గుప్త, నిజామాబాద్ జెడ్‌పి చైర్మన్ విఠల్‌రావు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News