Tuesday, May 14, 2024

డెల్టా వేరియంట్‌తోనే రెండో వేవ్ తీవ్రత

- Advertisement -
- Advertisement -

డెల్టా వేరియంట్‌తోనే సెకండ్ వేవ్‌లో అధిక తీవ్రత..!
కొత్తగా మరో 1,97,832 మందికి టీకా
పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు
మన తెలంగాణ/హైదరాబాద్: డెల్టా వేరియంట్ ప్రభావంతోనే సెకండ్ వేవ్‌లో అధిక తీవ్రత ఉందని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు డా జి శ్రీనివాసరావు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ, ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్యశాఖ తీసుకున్న నిర్ణయాల వలనే వైరస్‌ను కంట్రోల్ చేయగలిగామన్నారు. అయితే, మరిన్ని రోజులు ప్రజలు సహకరిస్తే కొవిడ్‌ను పూర్తి స్థాయిలో అదుపులోకి తేవొచ్చని గురువారం మీడియాకు వివరించారు. ఇదిలా ఉండగా అత్యధిక మంది వ్యాక్సిన్ తీసుకోవడం వలన వైరస్‌ను కట్టడి చేయొచ్చన్నారు. జూలై నెలలో ఏకంగా 30 లక్షల మంది సెకండ్ డోసుకు అర్హులు కానున్నట్లు తెలిపారు. వీరందరికీ ప్రత్యేకంగా టీకా వేస్తామన్నారు. కొవిషీల్డ్ రెండో డోసును 14 నుంచి 16, కొవాగ్జిన్ 4 నుంచి 6 వారాల తేడాతో ఇస్తామన్నారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,97,832 మందికి టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులిటెన్‌లో పేర్కొంది. వీరిలో 1,65,531 మంది మొదటి డోసు తీసుకోగా,32,301 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 3,00,212 మంది హెల్త్‌కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా 2,09,620 మంది రెండో డోసు తీసుకున్నారు. అదే విధంగా 3,10,222 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోసు తీసుకోగా, 1,35,579మంది సెకండ్ డోసు వేసుకున్నారు. దీంతో పాటు 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 39,15,961 మంది మొదటి, 49,217 మంది రెండో డోసు తీసుకున్నారు. ఇక 45 ఏళ్ల పై బడిన వారిలో 49,66,285 మంది మొదటి, 11,82,893 మంది రెండో డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 94,92,680 మంది తొలి, 15,77,309 మంది రెండో డోసును పూర్తి చేసుకున్నారు. ఇక కొవిన్‌లో నమోదైన 97,91,720 డోసుల్లో 62,970 ఆర్మీకి కేటాయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌లో 97,18,455 డోసులు వినియోగించగా, వ్యాక్సిన్ వేస్టేజ్ 0.11శాతం తేలింది. ఇదిలా ఉండగా కరోనా నియంత్రణ కేవలం వ్యాక్సిన్‌తోనే సాధ్యమని ఆరోగ్యశాఖ మరోసారి ప్రకటించింది.

Dr G Srinivas Press meet on Delta Variant

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News