Friday, April 26, 2024

రేపటి నుంచి మళ్లీ స్కూళ్లు

- Advertisement -
- Advertisement -

Educational institutions will resume from Tuesday

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ
విద్యాసంస్థల పునఃప్రారంభానికి
ప్రభుత్వం అనుమతి
విద్యాసంస్థల్లో పిల్లల
వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు
హాస్టళ్లలో ప్రత్యేక సౌకర్యాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళవారం నుంచి పాఠశాలలు సహా అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, తీవ్రత తక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాలలో పాఠశాలలు ప్రారంభించడం వంటి కారణాలతో ప్రభుత్వం విద్యాసంస్థల ప్రారంభానికి అనుమతించింది. అయితే పాఠశాలలు, కాలేజీల్లో కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఇప్పటికే విద్యాశాఖ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ నేపథ్యంలో ఇప్పటికే టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి కాగా, అర్హులైన విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ చేపట్టేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పిల్లల ఆరోగ్య భద్రత ముఖ్యమైన అంశం కాబట్టి, ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

అందులో భాగంగా 15 నుంచి 18 ఏళ్ల విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మాస్కులు ధరించడంతో పాఠశాలల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాలలకు సూచించింది.ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలల్లో తరగతి గదులు, పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా శానిటైజ్ చేయడంతో పాటు కొవిడ్ నిబంధనలు పాటించేలా స్కూళ్లలో ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లల్లో ఎవరికైనా జ్వరం, జలుబు వంటి కొవిడ్ లక్షణాలు కనిపిస్తే మాత్రం వారికి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో మంగళవారం నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులకు విద్యార్థులు పూర్తి స్థాయిలో హాజరుతారా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను తల్లిదండ్రులు మరో వారం పది రోజుల పాటు ధైర్యంగా పంపించకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్రంలో కొవిడ్ కేసుల దృష్టా కొంతకాలం పాటు ఎక్కువ మంది విద్యార్థులు హాజరు తరువాయి 9లో

కాకపోవచ్చని అధికారులు, పాఠశాలల నిర్వహకులు అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 1 తర్వాత వారం స్కూళ్లలో కరోనా కేసుల నమోదు, ఇతర అంశాలను పరిశీలించి ఆ తర్వాత కేజీ, ప్రాథమిక తరగతుల విద్యార్థులను బడి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హాస్టళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో హాస్టళ్లు తెరుచుకోనున్నాయి. కాలేజీలు, హాస్టళ్లలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు ఇతర కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం సబ్బులు, లిక్విడ్ హ్యాండ్‌వాష్‌లు అందుబాటులో ఉంచనున్నారు. యూనివర్సిటీ హాస్టళ్లలో ఉండే విద్యార్థులందరూ వ్యాక్సిన్ వేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. హాస్టళ్లు ప్రారంభమైన తర్వాత కొవిడ్ వ్యాప్తిపై అన్ని వర్సిటీలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

పిల్లల టీకాలపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో పిల్లల వ్యాక్సినేషన్‌కు విశేష స్పందన కనిపిస్తోంది. 15 నుంచి 18 ఏళ్ల వయసు గల పిల్లలకు ఈ నెల 3 నుంచి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, ఇప్పటివరకు అర్హులైన వారిలో 66 శాతం మంది పూర్తయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలు 18,41,000 మంది ఉండగా, శనివారం నాటికి 12,05,865 (66 శాతం) మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. అత్యధికంగా హన్మకొండ జిల్లాలో 97 శాతం మంది పిల్లలకు టీకాలు ఇవ్వగా, అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 46 శాతం మంది పిల్లలకు టీకాలు ఇచ్చారు. దేశంలో కొవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం పిల్లల వ్యాక్సినేషన్‌కు అనుమతించింది. రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల వారికి టీకా అందిస్తున్నారు.

విద్యాసంస్థల్లో వ్యాక్సినేషన్

రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్హులైన వారందకీ టీకాలు వేసేందుకు వైద్యారోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. పాఠశాలలు, కళాశాలల్లో అర్హులైన వారిలో ఇప్పటివరకు టీకాలు తీసుకోని వారిని గుర్తించి అక్కడికి వెళ్లి వ్యాక్సిన్ వేయనున్నారు. ముఖ్యంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలందరికీ టీకాలు వేసేలా చర్యలు తీసుకోనున్నారు. పిల్లల వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచే ఆరోగ్య సిబ్బంది విద్యాసంస్థలకు వెళ్లి టీకాలు వేశారు. ఈ నెల 8 నుంచి 30 విద్యాసంస్థలకు సెలవులు ఉండటంతో ఇళ్ల వద్దనే వ్యాక్సిన్ వేస్తున్నారు. విద్యాశాఖతో సమన్వయం చేసుకుని ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని అర్హులైన పిల్లలను గుర్తించి వారందరికీ టీకాలు వేసేలా ఆరోగ్య శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News