కలాంతో పనిచేసిన విశిష్టుడు
బెంగళూరు: పద్మ విభూషణ్ , ప్రముఖ శాస్త్రవేత్త రొద్దం నరసింహ మరణించారు. ఎరోస్పేస్ సైంటిస్టుగా దేశ అంతరిక్ష విశిష్ట కార్యక్రమాలకు తన సేవలు అందించిన నరసింహ వయస్సు 87 సంవత్సరాలు. మెదడులోని రక్తనాళాలు చిట్లడంతో విషమ పరిస్థితి ఏర్పడటంతో ఈ నెల 8వ తేదీన స్థానిక ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చికిత్సకు చేర్పించారు. అయితే ఆయన పరిస్థితి క్రమేపీ విషమించిందని, చికిత్సకు సరైన విధంగా స్పందించలేకపోవడంతో మంగళవారం కన్నుమూశారని డాక్టర్లు తెలిపారు. దేశ ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ సైన్సెస్లో ఆయన సైంటిస్టుగా వ్యవహరించారు. ఆయనకు గుండె సంబంధిత జబ్బులు కూడా ఉన్నాయని, ఇప్పుడు మస్తిష్క రక్తనాళాలు చిట్లడం విషమ పరిస్థితిని కల్పించిందని ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ సునీల్ వి ప్యూర్టడో తెలిపారు. సైంటిస్టు నరసింహకు భార్య, కూతురు ఉన్నారు.
శాస్త్రీయ పరిశోధక కేంద్రం జెఎన్సిఎఎస్ఆర్ ఇంజనీరింగ్ మెకానిక్ యూనిట్ ఛైర్పర్సన్గా వ్యవహరించారు. డాక్టర్ అబ్దుల్ కలాం మాదిరిగానే నిరాడంబరంగా ఉండే నరసింహ కలాంతో కలిసి స్పేస్ టెక్నాలజీ, ఫ్యూయిడ్ మెకానిక్స్ పరిణామాలపై ఓ పుస్తకం రాశారు. ప్రముఖ శాస్త్రవేత్త , భారత రత్న డాక్టర్ సిఎన్ఆర్ రావుకు మంచి మిత్రులు కూడా. భారతీయ రాకెట్ సైంటిస్టు ప్రొఫెసర్ సతీష్ ధావన్ వద్ద విద్యార్థిగా చదువుకున్నారు. ఇస్రో పరిశోధనలు, తేలికపాటి యుద్ధ విమానాలు, పలు ప్రధాన శాస్త్రీయ కార్యక్రమాలలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. శాస్త్ర విజ్ఞాన ప్రముఖులు, సన్నిహితుల నివాళుల తరువాత తమ ఇంటిపెద్ద అంత్యక్రియలు మంగళవారం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జిజ్ఞాస విజ్ఞానపు భారతదేశ సాంప్రదాయక లక్షణాలతోనే ఈ సైంటిస్టు దేశానికి ఆణిముత్యంగా నిలిచారని ప్రధాని మోడీ తెలిపారు. కుటుంబ సభ్యులకు సంతాప సందేశం పంపించారు.
Eminent scientist Roddam Narasimha no more