యువతకు విద్యార్హతలను బట్టి శిక్షణ ఇవ్వాలి
ప్రణాళికలను సిద్ధం చేయండి
అధికారులను ఆదేశించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకున్న ఎస్సీ ఎస్టీ, బిసి, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం ఉపాధి, ఇతర ఉపాధి అవకాశాలు కల్పించాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ సంక్షేమ భవనంలోని సమావేశ మందిరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చే పలు సంస్థల ప్రతినిధులు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో మంత్రి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లకు చెందిన కూలీలు తమ సొంత రాష్ట్రాలకు తరలిపోవడంతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయన్నారు. ఎస్సీ, ఎస్టీలను విద్యావంతులు చేయ డానికి ప్రభుత్వం గురుకుల వ్యవస్థను పెద్ద ఎత్తున ప్రారంభించిందని ఆయన తెలిపారు. ఇది అద్భుతమైన వ్యవస్థ అని భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇన్ని గురుకుల విద్యాలయాలు లేవని ఆయన తెలిపారు.
ఈ సంస్థల నుంచి రానున్న రోజుల్లో మంచి జాతిరత్నాలు వస్తాయన్నారు. అలాగే జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో విద్యార్హతలను బట్టి యువతకు వారికి ఏ రంగంలో శిక్షణ ఇస్తే బాగుంటుందో ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి సూచిం చారు. ఈ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తే ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. నిర్మాణరంగం, డ్రైవింగ్, విద్యుత్, భూసర్వే లాంటి శాఖలో నైపుణ్య శిక్షణ పొందిన వారికి ఎన్నో ఉపాధి మార్గాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఎండి లచ్చిరాం భూక్య, ఎన్ఏసి, ఎన్ఎస్ఐసి, ఐటిఐ, ఆర్టిసి, ఎన్ఐటిహెచ్ఈఎల్, సిఐటిడి సంస్థల ప్రతినిధులు, డైరెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.